Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేం చట్టాలు చేస్తం.. ఉద్యోగులు అమలు చేయాల్సిందే
- పిచ్చి పిచ్చిగా సమ్మెలు చేస్తే నష్టపోతరు
- దేశం ఆశ్చర్యపోయే రీతిలో రెవెన్యూ చట్టం తెస్తాం
- ఇంటికో ఉద్యోగమంటూ అడగొద్దు
- వీఆర్వోలను తొలగించాల్సొస్తే.. తొలగిస్తాం
- కౌలు రైతుల్ని గుర్తించేది లేదు..
- వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదు...
- అవే మా విధానాలు : శాసనసభలో సీఎం కేసీఆర్
- కాంగ్రెస్, బీజేపీలపై ముఖ్యమంత్రి విమర్శలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగులు ప్రభుత్వాన్ని శాసించజాలరని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను వారు చేయాలని అన్నారు. వారు చెప్పిన విధంగా చట్టాలు చేయాల్సి వస్తే.. అసలు శాసనసభ ఎందుకు? మనం (ప్రజా ప్రతినిధులు) ఎందుకంటూ ప్రశ్నించారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి ఉద్యోగులు మసలుకోవాలని హితవు పలికారు. అలాగాక పిచ్చి పిచ్చి సమ్మెలంటూ వస్తే.. వారే నష్టపోతారని హెచ్చరించారు. కేవలం ఉద్యోగుల కోసమే ప్రభుత్వ శాఖలు పని చేయబోవనీ, చెప్పిన పని చెయ్యక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 'కుక్క అనేది
తోకను ఆడించాలి తప్ప.. తోకే కుక్కను ఆడించాలను కోవటం పొరపాటు...' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వీఆర్వోలను తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. వారిని తీసేస్తామంటూ చెప్పామా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఒకవేళ వారిని కూడా తొలగించాల్సి వస్తే, తొలగిస్తాం... తప్పేంటని అన్నారు. వారేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా..? అని సీఎం ప్రశ్నించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆదివారం అసెంబ్లీలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు.
కౌలు రైతులపై..
రాష్ట్రంలోని కౌలు రైతులతో ప్రభుత్వానికి ఎలాంటి సం బంధమూ లేదని అన్నారు. అందువల్ల వారిని ఎట్టి పరిస్థితు ల్లోనూ గుర్తించబోమని పునరుద్ఘాటించారు. కౌలు రైతుల పట్ల ఇదే తమ విధానమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై వివరణలు ఇస్తూ.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
రెవెన్యూచట్టానికి కొత్త హంగులు
యావత్ దేశం ఆశ్చర్యపడే రీతిలో నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందిస్తామని సీఎం తెలిపారు. తాము అనుకున్న రీతిలో ధరణి వెబ్సైట్ రూపొందితే.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే భూములకు సంబంధించిన అమ్మ కాలు, కొనుగోళ్లు, వాటి పట్టాలను పొందవచ్చని చెప్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇలాంటి సేవలన్నింటినీ పొందొచ్చని వివరించారు. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా తానే రికార్డుల్లోంచి అనుభవదారుడనే కాలాన్ని తొలగించాలంటూ చెప్పానని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 8లక్షల మందికి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేశా మని తెలిపారు. రాష్ట్రంలో 80శాతం భూమి దళిత, గిరిజన, బలహీనవర్గాల వారి చేతుల్లోనే ఉందన్నారు. మిగతా 20 శాతం మాత్రమే అగ్రవర్ణాల వారి చేతుల్లో ఉందని వివరిం చారు. ఈ క్రమంలో వాస్తవ రైతులకు అన్యాయం జరక్కుం డా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారం దరూ అప్పుల నుంచి బయటపడి తమ జేబులోని డబ్బుతో పంటకు పెట్టుబడి సమకూర్చుకోవాలని ఆకాక్షించారు. అప్పటిదాకా కౌలు రైతులను పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో జమీందార్లు, జాగీర్దార్ల వ్యవస్థ ఉండేదనీ, ఇప్పుడు కాలం మారిందని చెప్పారు. తమ బ్యాంకు అప్పులను రైతులు నిర్ణీత కాల వ్యవధి (కట్ ఆఫ్ డేట్)లోగా చెల్లించి.. ఖాతాలను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. అలాంటి వారందరికీ ప్రభుత్వం హామీనిచ్చిన విధంగా రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని తెలిపారు.
ఇంటికో ఉద్యోగమా..!
నియామకాలకు సంబంధించిన అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఉద్యోగాల గురించి అడగొద్దంటూ తాము చెప్పటం లేదనీ, కానీ ఇంటికో ఉద్యోగం గురించి మాట్లా డుతూ.. యువతను రెచ్చగొట్టొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేకాభివృద్ధి నిధులు పక్కదోవ పట్టాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఒకవేళ అలాంటి వివరాలు ఏమైనా ఉంటే తనకు నేరుగా పంపాలని సూచించారు. నిధులు నిజంగానే దారి మళ్లాయని తేలితే.. సంబంధిత అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పద్నాలుగో ఆర్థిక సంఘం నిధుల నుంచి పంచాయతీలకు ఎన్ని డబ్బులైతే వస్తాయో.. అన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం కలిపి గ్రామాలకు అందజేస్తుందని వివరించారు. ఆ ప్రకారంగా 500 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి రూ.8 లక్షలు వస్తాయని చెప్పారు.
కాంగ్రెస్ది దుష్ట పరిపాలన..
ప్రతిపక్ష కాంగ్రెస్పై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని 51 యేండ్లపాటు పాలించిన కాంగ్రెస్.. దుష్ట, దుర్మార్గపు విధానాలను అవలం భించిందని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రాలు మున్సిపాల్టీలకంటే అధ్వాన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా అనేక తరగతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలంటూ గతంలో మన్మోహన్సింగ్కూ, ఇప్పుడు మోడీకీ వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోలే దని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇంతవరకూ మోక్షం కలగలేదన్నారు.
51 యేండ్లపాటు పాలించిన పార్టీ.. ఇంటికో ఉద్యోగం ఎందుకివ్వలేదంటూ దుయ్యబట్టారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు ఉన్న హక్కుల న్నింటినీ కాంగ్రెస్ హరించి వేసిందని విమర్శించారు. ఏ,బీ,సీ,డీ వర్గీకరణ గురించి కాంగ్రెస్, బీజేపీ రెండూ మాట్లాడటం లేదని అన్నారు. అందువల్ల ఆ రెండు పార్టీలూ దొందూ దొందేనని విమర్శించారు. ఢిల్లీలో వానపడితే.. ఇక్కడ గొడుగు పట్టటం కాంగ్రెస్ నేతల ఆనవాయితీ అని అన్నారు. ఆ పార్టీ అర్థ శతాబ్దపు పాలనలో అద్భుతమైన కరెంటు కోతలను మనం చూశామనీ తెలిపారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేశంలో ఉన్న అన్ని రుగ్మతలకూ బ్రీడింగ్ సెంటర్ కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు, మత కల్లోలాలకు ఆ పార్టీ పెట్టింది పేరని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీవి శూన్య హస్తాలే...
కేంద్రంలోని బీజేపీ గురించి మాట్లాడుతూ.. జిల్లాకో నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలంటూ చట్టంలో పేర్కొన్నారనీ, కానీ మోడీ సర్కారు దాన్ని తుంగలో తొక్కిం దని సీఎం విమర్శించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు జాతీయ హోదా కావాలంటూ కోరితే పట్టించుకోలేదని చెప్పారు. మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు రూ.24 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలంటూ నిటి అయోగ్ చెప్పినా.. ఇంతవరకూ ఒక్క పైసా విదల్చ లేదని తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం యేడాదికి రూ.450 కోట్లు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ఏడాది నిధులను ఇంకా పెండింగ్లోనే ఉంచారని తెలిపారు. ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా రూ.2016 పెన్షన్ అమలవుతున్నదా? అని ప్రశ్నించారు. ఆయా రాష్ట్రాల కంటే టీఆర్ఎస్ పాలిస్తున్న తెలంగాణలోనే అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు.
అందువల్లే నాందేడ్కు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ విజ్ఞప్తి చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించిన వారిని.. భయ భ్రాంతులకు గురి చేయటం బీజేపీకి ఆనవాయితీగా మారిందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఈ రకంగా రాష్ట్రాల నిధులు, విధులు, అధికారాలపై బీజేపీ గుత్యాధిపత్యం, పెత్తనం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసి రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని తెలిపారు. అవసరమైనప్పుడు మాత్రం ఆ రెండు పార్టీలూ కుమ్మక్కవుతాయని విమర్శించారు.