Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మస్తీపూర్ గ్రామంలో యురేనియం అన్వేషణ
- వనపర్తి జిల్లాలో నిక్షేపాలు ఉన్నట్టు ప్రాథమిక నిర్ధారణ...?
- జీపీ తీర్మానాల్లేకుండానే బలవంతపు సర్వే
నవతెలంగాణ-మహబూబ్నగర్ప్రతినిధి
యురేనియం అన్వేషణ ప్రక్రియ ముమ్మరమైంది. సాగుభూముల్లో అనుమతుల్లేకుండానే బోర్ల తవ్వకాలు చేపడుతూ పుడమికి తూట్లు పొడుస్తున్నారు. అనుమతు లివ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించినా యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారులు తమపని తాము చేసుకుంటూ పోతున్నారు. 'ఏ అనుమతీ మాకు అవసరం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అన్వేషణ ఆపేది లేదు' అంటూ రైతులకు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తీపూర్ గ్రామం లో యురేనియం అన్వేషణ కోసం బోరుబావులు తవ్వడం స్థానిక రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది.
ఒకవైపు తవ్వకాలు చేపట్టడం లేదని ప్రజలను నమ్మిస్తున్న అధికారులు.. బోరుబావులు తవ్వుతూ నీటి శాంపిళ్లను సేకరిస్తున్నారు. బోరు తవ్వే వాహనాల ద్వారా 'బుల్లెట్ల' వంటి కడ్డీలను బయటకు తీస్తున్నారు. ఇంకా తవ్వకాలు చేపట్టడం లేదని అధికారులు అంటున్నా.. ఆ శాంపిళ్ల ద్వారానే యురేనియం నిక్షేపాలను గుర్తిస్తున్నట్టు తెలిసింది. అందులో భాగంగానే గత నాలుగురోజులుగా మస్తీపూర్ గ్రామంలో 24 బోరుబావులను ఒక్కోటి 2వేల ఫీట్లకుపైగా లోతుకు తవ్వారు. దీంతో పట్టా భూముల్లో తమకు తెలియకుండా సర్వే ఎలా చేస్తున్నారని రైతులు ఎదురు తిరిగారు. యుసిఐఎల్ అధికారులు కల్పించుకుని 'కేంద్రం అనుమతులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరేనని ఒప్పుకుంది. కలెక్టర్ అనుమతులతోనే బోర్లు వేస్తున్నాం' అంటూ రైతుల్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఆ గ్రామస్తులకు సరైన అవగాహన లేకపోవడం, వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని విషయం బయటకు పొక్కకుండా అధికారులు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో డీవైఎఫ్ఐ, సీపీఐ(ఎం) నాయకులు ఆది, సోమవారాల్లో అక్కడ పర్యటించి ర్యాలీ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిం చారు. సోమవారం పలువురు నాయకులు వెళ్లి పనులను అడ్డుకున్నారు.
ఉమ్మడి పాలమూరుకు తీవ్ర నష్టం
నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని పదర, అమ్రాబాద్, మండలాల్లో యురేనియం కోసం సర్వేలు చేస్తుంటే అక్కడి ప్రజలు అడ్డుకున్నారు. 20వేల ఎకరాల్లో 4వేల బోరు బావులు తవ్వి యురేనియం బయటికి తీయాలనే ఆలోచన ఉండగా ఆందోళనలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సర్వే కోసంగానీ, యురేనియం తవ్వకాల కోసంగానీ ఎలాంటి అనుమతులివ్వబోమని తీర్మానించగా పక్షం రోజుల్లోనే అమరచింతలో అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. మరోవైపు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు లక్షల మందికి సాగునీరు అందించే మిషన్ భగీరథ ప్రశ్నార్థకంగా మారుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కనీస సమాచారం ఇవ్వలేదు..
ఇక్కడ బోరుబావులు తవ్వుతున్నామని మాకు కనీస సమాచారం లేదు. 1500 నుంచి 2వేల ఫీట్లు వేస్తు న్నారు. గ్రామస్తులు ఆందోళన చెందుతు న్నారు. జీపీ అనుమతుల్లేకుండా ఎలా సర్వే చేస్తారు? వెంటనే పనులు నిలిపి వేయాలి. పర్యవరణాన్ని రక్షించాలి.
- సుజాత, మస్తీపూర్ సర్పంచ్
తవ్వకాలను అడ్డుకుంటూనే ఉంటాం..
బోరుబావుల తవ్వకాలను అడ్డుకుంటూనే ఉంటాం. ఈ బోరుబావుల నుంచి మూలకాలు బయటకు వస్తున్నాయి. యురేనియం, అబ్రకం, బొగ్గు బయటకు వస్తున్నట్టు తెలు స్తోంది. వాటిని రహస్యంగా ఉంచి యురేనియం కార్పొరే షన్ లిమిటెడ్ వారికి పంపుతున్నారు. యురేనియం సాంద్రత తెలుసుకున్న తరువాత ఇక్కడ అసలైన యురేనియం తవ్వకాలు మొదలవుతాయి. దీనివల్ల జూరాల ఆయకట్టే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. పాలకులు వెంటనే తవ్వకాలు ఆపేయాలి.
- ఎండీ జబ్బార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, వనపర్తి