Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి బస్సులో టికెట్ ధరల పట్టిక
- అన్ని డిపోల్లో డీఎస్పీ ఇన్చార్జీగా కంట్రోల్రూం
- టికెట్ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు
- ప్రతిబస్సులో పాస్లు కచ్చితంగా అనుమతించాల్సిందే : మంత్రి పువ్వాడ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం రవాణా వ్యవస్థకు పకడ్భందీ చర్యలు తీసుకుందని, ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా వాహనాలను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిపడా బస్సులు తిరుగుతున్నాయని, ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలపై దష్టి పెడుతున్నామని, టికెట్ ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్మికుల సమ్మె, రవాణా శాఖ తీసుకున్న చర్యలు, పండుగకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు చేయా ల్సిన ఏర్పాట్లపై మంత్రి పువ్వాడ అజయ్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులు, ఈడీలు, రీజనల్, డివిజనల్ మేనేజర్లు, ఆర్టీఓలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘంగాచర్చించారు. మంత్రిపువ్వాడ మాట్లా డుతూ ప్రస్తుతం ప్రయాణీకుల రద్దీకి సరిపడా బస్సులు తిప్పుతున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల టికెట్ రేట్ కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, టికెట్ కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని, ప్రతి బస్సుతోపాటు ఆయా రూట్లల్లో ఛార్జీల పట్టికను ఏర్పాటు చేస్తున్నామన్నా రు. దీని కోసం ప్రతి డిపోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి పోలీస్ శాఖ నుంచి డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్గా నియమిస్తున్నట్టు చెప్పారు. బస్సుల్లో డ్రైవర్ సీటు వెనకాల ధరల పట్టిక కింద ఆయా కంట్రోల్ రూంల నెంబర్లను కూడా ప్రదర్శిస్తామని, టికెట్ ధర కంటే ఎక్కువ ఛార్జీ తీసుకుంటే ఆ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి వివరించారు. 14 నుంచి విద్యా సంస్థలు కూడా ప్రారంభం కానుండటంతో... షెడ్యూల్ ప్రకారం బస్సులను నడుపుతామన్నారు. ప్రతి డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముందు ఎలాంటి టూర్ షెడ్యూల్ ఉండేదో అదే షెడ్యూల్ను దాదాపు శుక్రవారం నుంచి అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వెళ్లాల్సిన బస్సులను నడుపుతామ న్నారు. ఇక ఆర్టీసీ బస్సులన్నింటా బస్పాస్లను యదావిధిగా అనుమతించాలని ఆదేశాలిచ్చామ న్నారు. విద్యార్థులు, వికలాంగులు, పాత్రికేయులు, ఉద్యోగులతో పాటు బస్పాసులన్నీ అనుమతించా లని, బస్పాస్లు అనుమతించడం లేదనే ఫిర్యాదు రావద్దని ఆదేశించారు. నాలుగు రోజులుగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు ఆయా వాహనాలను తిప్పి, ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చామని, ఇదే రీతిన తిరుగు ప్రయాణానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామ న్నారు. ప్రత్యేక సర్వీసుల సేవలన్నీ విని యోగించుకుంటున్నట్టు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ బస్సులు 3116, ఆర్టీసీ అద్దెబస్సులు 1933తో పాటు ప్రైవేట్ వాహనాలు తిరిగాయన్నారు. ఈ రెండు రోజులు ప్రయాణీకుల రద్దీని బట్టీ మరిన్ని వాహనాలను తిప్పుతామన్నారు. రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను పెంచారని, అన్ని శాఖల సహకారంతో సమ్మె ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.