Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ కార్మికుల సొమ్ము వాడుకున్న యాజమాన్యం
- పీఎఫ్ ఖాతా నుంచి రూ.864 కోట్లు
- సొసైటీ ఖాతానుంచి మరో రూ. 546 కోట్లు
- బకాయిలు రీయింబర్స్ చేయని ప్రభుత్వం
- ఆందోళనలో కార్మికులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్మికులు దాచుకున్న భవిష్యనిధి (పీఎఫ్) సొమ్ముకు రెక్కలొ చ్చాయి. పదవి విరమణ పొందిన తర్వాత ఉద్యోగులకు ఉపయోగ పడేలా రూపొందించిన ఈ పథకం నిధులు కాస్త పక్కదారి పట్టాయి. కార్మికుల సొమ్మును యాజమాన్యమే సొంతానికి వాడుకోవడం విమర్శలకు దారితీస్తున్నది. ఉద్యోగుల అనుమతి లేకుండా 2015 నుంచి 2019 వరకు ఐదేండ్ల కాలంలో పీఎఫ్, సహకార సంఘం నుంచి రూ. 1409 కోట్లను యాజమాన్యం సొంత అవసరాలకు వినియోగించుకోవడంపై అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే సంస్థ దివాళా తీసిన నేపథ్యంలో తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఇస్తుందో లేదోననే ఆందోళన కార్మికుల్లో నెలకొంది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి 2014లో విడిపోయిన తర్వాత టీఎస్ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ తదితర విభాగాల్లో మొత్తం 48 వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంస్థలో పని చేస్తున్న కార్మికులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును చెప్పాపెట్టకుండా యాజమాన్యం కాజేసింది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ. 863 కోట్లు, ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం నుంచి రూ. 546 కోట్లను యాజమాన్యం మెక్కేసింది. కార్మికుల అనుమతి తీసుకోకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొమ్ము వాడుకోవడంపై గతంలో కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళన నిర్వహించాయి. యాజమాన్యం మాత్రం ఇప్పుడిస్తాం, అప్పుడిస్తామంటూ రెండేండ్లుగా కాలయాపన చేస్తూనే ఉంది. సమ్మెకు పోయే ముందు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. గడిచిన ఐదేండ్ల కాలంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాక పోవడంతోనే తాము కార్మికుల సొమ్మును తాత్కాలికంగా వాడుకున్నామని యాజమాన్య చెబుతున్నది. విద్యార్థులు, స్వాతంత్య్ర సమరయోధులు తదితరులకు ఇచ్చిన రాయితీలకు గాను ప్రభుత్వం ఇంకా రూ. 2వేలకోట్లు చెల్లించాల్సి ఉందనీ, అవి రాగానే చెల్లిస్తామని యాజమాన్యం అంటున్నది. సంస్థకు రావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే దివాళా తీసిందనీ, దీనికి సర్కారే బాధ్యత వహించాలని కార్మికులు అంటున్నారు. గృహనిర్మాణాలు, వాహన కొనుగోళ్లు, తదితర రుణాల కోసం కార్మికులు పెట్టుకున్న దరఖాస్తులు అర్టీసీ సహకర పొదుపు సంఘంలో దాదాపు 16 వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. సంఘంలో నిధులు లేక పోవడంతోనే యాజమాన్యం రుణాలు ఇవ్వలేక కుంటి సాకులు చెబుతున్నదని కార్మికులు విమర్శిస్తున్నారు. ఒకప్పుడు లాభాల బాటలో ఉన్నసంస్థను నస్టాల ఊబిలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రావాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పీఎఫ్ అంటే?
ఉద్యోగులకు సాంఘీక భద్రత కల్పించేందకు కేంద్ర ప్రభుత్వం భవిష్యనిధి (పీఎఫ్) పథకాన్ని 1952 మార్చ్4న ప్రవేశ పెట్టింది. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జమ చేసుకున్న మొత్తం పదవి విరమణ తర్వాత ఉపయోగ పడేందుకు ప్రభుత్వం ఈపథకాన్ని ప్రవేశ పెట్టింది. వేతన నిర్వచనం ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ను డిసైడ్ చేయనుంది. ఉద్యో గి బేసిక్ వేతనం, డియర్నెస్ అలవెన్స్ (డీఏ) కలిపితే వచ్చేమొత్తంలో 12 శాతం ఈపీఎఫ్ఖాతాలో జమవుతుంది. ఉద్యోగి పనిచేసే కంపెనీ కూడా దీనికి సమానమైన మొత్తాన్ని అంటే మరో 12శాతాన్ని పీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. ఉద్యోగి జమ చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్కు గాను 8.15శాతం వడ్డీచెల్లిస్తారు. వివాహం, ఉన్నతవిద్య, ఆరోగ్యం, స్థలంకొను గోలు, గృహనిర్మాణం తదితర అవసరాలకు పీఎఫ్ ఖాతా నుంచి నిబంధనల ప్రకారం ఉద్యోగులు దాచుకున్న డబ్బులు పొందవచ్చు.