Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- మేం సిద్ధం : టీఎస్ఆర్టీసీ జేఏసీ
- సమ్మెకు టీఎన్జీవోల మద్దతు
- 11వ రోజు సమ్మె ప్రశాంతం
- సమ్మె కొనసాగుతుంది : అశ్వత్థామరెడ్డి
- రాయబారం నడుపుతా : కేకే
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''చర్చలతో యుద్ధాలే ఆగిపోతాయి. అలాంటిది ఆర్టీసీ కార్మికులతో చర్చించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? వారితో చర్చలు జరిపి, రెండ్రోజుల్లో ముగించండి. కార్మికుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు తక్షణం ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టర్ను నియమించండి'' సర్కారుకు హైకోర్టు ఇచ్చిన ఆదేశం ఇది. చర్చల్లో ప్రభుత్వం, కార్మిక సంఘాలు తీసుకున్న చర్యల సారాంశాన్ని ఈనెల 18న న్యాయస్థానానికి వెల్లడించాలని చెప్తూ కేసును వాయిదా వేసింది. కోర్టు ఆదేశాలను టీఎస్ఆర్టీసీ జేఏసీ స్వాగతించింది. ప్రభుత్వం లేదా యాజమాన్యం ఎవరితోనైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. సమ్మె కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు టీఎన్జీవోలు సమ్మెకు మద్దతు తెలిపారు. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం జరిపేందుకు ఆ సంఘం అధ్యక్షులు కారెం రవీందర్రెడ్డిని పంపాలని వారి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశారు. దీన్ని కూడా టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఈ అశ్వత్థామరెడ్డి (టీఎమ్యూ), కో కన్వీనర్లు కె రాజిరెడ్డి (ఎంప్లాయీస్ యూనియన్), వీఎస్ రావు (స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్), ఓ సుధ (సూపర్వైజర్స్ అసోసియేషన్) స్వాగతించారు. మంగళవారం జేఏసీ నేతలు నాంపల్లిలోని టీఎన్జీవోల కార్యాలయానికి వెళ్ళి మద్దతు కోరారు. దీనికి వారుకూడా సానుకూలంగా స్పందించారు. మరోవైపు 11వ రోజు సమ్మె జయప్రదంగా కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మానవహారాలు చేపట్టి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీనికి ప్రతిపక్ష రాజకీయపార్టీలు, ప్రజా, కార్మిక, విద్యార్ధి, యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. పలుచోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు కొనసాగాయి. సెప్టెంబర్ నెలలో పనిచేసిన రోజులకు వేతనాలు ఇవ్వాలంటూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (టీజేఎమ్యూ) హైకోర్టులో మరో కేసు దాఖలు చేసినట్టు ప్రధాన కార్యదర్శి కె హన్మంతు తెలిపారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం కేసును బుధవారానికి వాయిదా వేసింది. కార్మికుల పక్షాన తాను ప్రభుత్వంతో రాయబారం నడుపుతానని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు పునరుద్ఘాటించారు. ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు సహా ప్రజాప్రతినిధులు ఎవరూ మంగళవారం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. దీనితో ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వం కూడా సానుకూలంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే చర్చల్ని ఏ విధంగా నిర్వహిస్తుందనేదానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. ఆర్టీసీని విలీనం చేసుకోలేమని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పినందువల్ల, ఆ డిమాండ్ను మినహాయించి మిగిలిన అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆత్మహత్యలు చేసుకున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను కూడా జేఏసీ నేతలు డిమాండ్ చేయనున్నట్టు సమాచారం.