Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపరాష్ట్రపతి వెంకయ్య ఉద్ఘాటన
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
సైరా నర్సింహారెడ్డి సినిమాలో వలసవాదుల నియంత పాలన గురించి చక్కగా చూపించారని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. బుధవారం ఆయన నివాసంలో సైరా నర్సింహారెడ్డి సినిమాను వీక్షించారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ సైరా నర్సింహారెడ్డి సినిమా చాలా బాగుందని, చక్కని చిత్రాన్ని నిర్మించారని అన్నారు. సినిమాలో వలసవాదుల నియంత పాలన గురించి అద్భుతంగా చూపించారన్నారు. ఈ సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతుందని అన్నారు. భారత దేశం స్వరూపాన్ని సినిమాలో చూపించారని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం గొప్ప నిర్ణయమన్నారు. చిత్ర నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సినిమాలో చిరంజీవి నటన చాలా బాగుందని, అమితా బచ్చన్, తమన్నా, నయనతార చాలా బాగా నటించారని తెలిపారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అడిగా: చిరంజీవి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమయం తీసుకొని సినిమా చూడడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రాజకీయాలలో ఆయన ఎదిగారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడిగానని తెలిపారు. బీజేపీలో చేరుతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు చిరంజీవి సమాధానం దాటవేశారు.