Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
- తక్షణమే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి
- బంద్ను జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదని, సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదే శించడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ వ్యాఖ్యానించింది. శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు ప్రారంభించాలని కోరారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి హైకోర్టు వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని గుర్తు చేశారు. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చించాలని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరపడం ప్రభుత్వ కనీస బాధ్యత అని పేర్కొన్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల మీద హైకోర్టు వరుసగా వ్యాఖ్యలు చేయడం అరుదుగా జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ సమస్య సీఎం కేసీఆర్ సొంత వ్యవహారం కాదనీ, తెలంగాణ సమాజంపై ప్రభావం చూపుతున్నదని పేర్కొన్నారు. నియంతృత్వంగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. రాజకీయ పార్టీలపై విమర్శలు చేసే శ్రద్ధ ఆర్టీసీ సమ్మెపై ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని తెలిపారు. పట్టువిడుపుల్లేకుండా, హుందాగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. శనివారం రాష్ట్రబంద్ను జయప్రదం చేయాలని కార్మికులు, ఉద్యోగులు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బంద్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగాలని తెలిపారు. సకల జనులంతా బంద్లో పాల్గొనాలని కోరారు. అప్రజాస్వామికంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వైఖరిని ప్రజలు ప్రశ్నించాలని పేర్కొన్నారు. రాష్ట్రబంద్ ద్వారానైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని తెలిపారు.