Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పుడు ఎవ్వరూ ఆపలేరు
- సమ్మె నివారణకు చర్యలు తీసుకోలేదే ? :సర్కారుతీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
- ఆర్టీసీ ఎండీని ఎందుకు నియమించలేదు.. అతని జీతం జేబుల్లోనుంచి ఇస్తున్నారా : వ్యాఖ్య
- డిమాండ్లలో కొన్ని పరిష్కరించొచ్చు
- ఆర్టీసీ మనుగడకు, ప్రయాణికులకూ మంచిదే
- కొత్త ఉద్యోగుల నుంచి డిమాండ్లు రావని గ్యారంటీ ఏంటి ?
- సమ్మెకు వ్యతిరేకంగా ఉత్తర్వులివ్వలేం:డివిజన్బెంచ్
- నేటి ఉదయం నుంచి చర్చలు ప్రారంభించాలని ఆదేశం
- కేసు 28కి వాయిదా
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి దిగి రెండు వారాలైనా ఇప్పటిదాకా ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేసింది. సర్కారుతోపాటు ఆర్టీసీ అధికారులకు చీవాట్లుపెట్టింది. ఇప్పటికే చర్చలు జరపాలని సూచించినా ప్రభుత్వంగానీ, ఆర్టీసీ కార్పొరేషన్గానీ, స్పందిం చకపోవడాన్ని ప్రశ్నించింది. అసహనాన్ని ప్రదర్శించింది. ఈసారి పది రోజుల సమయం ఇస్తున్నామనీ, ఈలోగా ఆర్టీసీ ఎండీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, జేఏసీ నేతలతో చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సారి లిఖిత పూర్వకంగా ఎండీకి సూచనలతో కూడిన మార్గదర్శకాలు ఇచ్చింది. సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఓయూ రీసెర్చ్ స్కాలర్ సుభేందర్సింగ్, దసరా సెలవుల పొడిగింపుపై తల్లిదండ్రుల సంఘం, సెప్టెంబర్ నెల జీతాల చెల్లింపుపై ఆర్టీసీ సంఘం తదితర సంఘాలు, వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి అభిషేక్రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. అగ్గి రాజేసి చలి కాచుకోవద్దని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు రాకపోతే సమస్యతోపాటు ఇతర పరిణామాలు ముదిరి పాకానపడే ప్రమాదం ఉంటుందని మరోసారి హైకోర్టు హెచ్చరించింది. ఫిలిప్పీన్స్లో సమ్మెలతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. కార్మికులకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలని సర్కార్కు సూచించింది.
చిన్నపాటి సమస్యనే పరిష్కరించలేదు : ఏజీకి డివిజన్ బెంచ్ చురకలు
ఆర్టీసీ సమ్మె, తర్వాత జరగబోయే పరిణామాల న్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని అదనపు ఏజీ రామచందర్రావు చెప్పడాన్ని డివిజన్బెంచ్ తీవ్రంగా స్పందించింది. సమ్మె వంటి చిన్న పాటి సమస్యనే ఇప్పటి వరకూ పరిష్కరించలేకపోయారనీ, రేపు ప్రజల నుంచి నిరసన పెరిగితే ఏం చేస్తారనీ, ఇప్పటికీ బడులు, కాలేజీలు తెరవనేలేదని, మెడికల్ కాలేజీలు మినహా మిగిలిన విద్యా సంస్థలన్నింటికీ దసరా సెలవుల్ని పెంచిన విషయాన్ని మరిచిపోయారా అంటూ నిరసించింది. సోమవారం నుంచి విద్యా సంస్థలు తెరుచుకుంటాయనీ,. ఇప్పటికే 85 శాతానికిపైగా బస్సులు నడుపుతున్నారనీ, మిగిలినవి కూడా కొద్ది రోజుల్లోనే రోడ్డెక్కుతాయని సర్కారు తరఫున డివిజన్ బెంచ్కు ఏజీ వివరణ ఇచ్చారు. మీరు వంద శాతం నియామకాలు చేసి బస్సుల్ని నడిపితే చెప్పుకోవడానికి బాగానే ఉన్నదనీ, ఈ వంద శాతం కొత్త ఉద్యోగుల నుంచి కూడా ఒకరోజు ఇప్పటి ఉద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్లు రావని గ్యారెంటీ ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.
వీటిని పరిష్కరించొచ్చు:బెంచ్
డిపోల వద్ద డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి గదులు, తార్నాక ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది, మందులు కావాలని, ఆధునిక బస్సులపై శిక్షణ ఇప్పించాలని, డీడీ వంటి పోస్టుల్ని భర్తీ చేయాలని, పిల్లలకు ఐటీఏ వంటి శిక్షణ ఇప్పించాలని, ఉద్యోగుల సొంత పీఎఫ్ ఉపసంహరణకు అవకాశం ఇవ్వాలని, పదవీ విరమణ తర్వాత పెన్షన్ ఉండని కారణంగా పేదలకు ఆసరా పెన్షన్ అమలుచేయాలని, ఆరోగ్యశ్రీ హెల్త్కార్డులు మంజూరు చేయాలని, బస్సులకు విడిభాగాలు సరఫరా చేయాలని.. ఇలాంటివన్నీ కూడా అమలు చేస్తే ఆర్టీసీ మనుగడకు, ఆ సంస్థ ప్రయాణికులకు కూడా మేలు జరుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై అదనపు ఏజీ.. నిజమేనని ఒప్పుకోవడం గమనార్హం.
అలా అనలేదు:ప్రకాశ్రెడ్డి
ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తేనే ఇతర అంశాలపై చర్చిస్తామని యూనియన్లు తెగేసి చెప్పాయనీ, దాంతో చర్చలు ఫలప్రదం కాలేదని ఏజీ బెంచ్కు చెప్పారు. మజ్దూర్ యూనియన్ సీనియర్ లాయర్ డి.ప్రకాష్రెడ్డి వాదనలు వినిపిస్తూ విలీనం డిమాండ్ను వదలలేదని, అది కోరుతూనే ఇతర డిమాండ్లను సాధించుకునేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని, రెండింటినీ ముడిపెట్టి చర్చలు జరపం అని చెప్పలేదని డివిజన్బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఆర్టీసీ విలీనం వ్యవహారం 2013 నుంచే ఉందని, అప్పుడు ఈ అంశంపై అధ్యయనానికి అప్పట్లోని సర్కారు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
అమలుకాని ఉత్తర్వులివ్వం:హైకోర్టు
సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ లాయర్ కృష్ణయ్య కోరారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారనీ, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, అయినా ఆర్టీసీలోగానీ, సర్కార్లోగానీ కదలిక లేదన్నారు. ఈసందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని సమ్మెకు వ్యతిరేకంగా అమలు కాని ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
ప్రజాగర్జనే అయితే..ఏమీచేయలేం:బెంచ్
సమ్మెకు మద్దతుగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేస్తున్నారని, క్యాబ్లు కూడా సమ్మెకు మద్దతు ఇచ్చాయని , ఇతర ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయని పత్రికల్లో వార్తలు రావడంపై హైకోర్టు స్పందిస్తూ, స్వరం స్వరం కలిస్తే ప్రజాగళం గర్జన అవుతుందనీ, అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేమని, ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వరకూ నాన్చకుండా తక్షణమే ఆర్టీసీ కార్పొరేషన్, ప్రభుత్వం సమ్మె నివారణా చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరింది. తాను ఆర్టీసీ తరఫున వాదిస్తున్నాననినీ, ప్రభుత్వం తరఫున కాదనీ, ఆర్టీసీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నదనీ, ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లల్లో కీలకమైన విలీనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయలేమని అదనపు ఏజీ పలుసార్లు చెప్పారు. గతంలో హైకోర్టు కూడా అనేకసార్లు ఈ సమస్య సాధన కోసం చర్యలు తీసుకోవాలని సూచనలు చేసినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.
సమ్మె విషయమై ఆర్టీసీ ఎండీ కార్మిక సంఘాలతో చర్చించి ఈనెల 28న జరిగే విచారణనాటికి పురోగతిని తెలియజేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.
సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలి..
హైకోర్టులో ఆర్టీసీ ఇన్ఛార్జీ ఎండీ కౌంటర్ దాఖలు
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో శుక్రవారం కౌంటర్ దాఖలు చేశారు. ఏటా ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే జీతాలు చెల్లించే పరిస్థితులున్నాయని, ప్రతి నెలా ఆర్టీసీ సొంత ఆదాయం నుంచి జీతాలు ఇవ్వలేకపోతున్నదని కోర్టుకు వివరించారు. ఉమ్మడి ఏపీలో అయిదేండ్లలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.712 కోట్లేనని తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకూ తెలంగాణ సర్కార్ రూ.4,250 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. రూ.1,200 కోట్ల మేరకు వార్షిక నష్టమని, నెలకు జీతాలకు రూ.240 కోట్లు అవసరమన్నారు.
రాబడి రూ.4,882 కోట్లు అయితే ఖర్చు రూ.5,811 కోట్లు అవుతున్నదన్నారు. అప్పు రూ.4,709 కోట్లు ఉంటే, ఆ మొత్తంలో రూ.1,660 కోట్లు క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవుల నగదు రూ.3,049 కోట్లని వివరించారు. ఆదాయంలో 58 శాతం జీతాలకే సరిపోతున్నదన్నారు. 2015లో ఫిట్మెంట్ 44 శాతం ఇచ్చినందున రూ.900 కోట్లు, 2017లో మధ్యంతర భృతి (ఐఆర్) 16 శాతం ఇవ్వడం వల్ల ఏటా రూ.200 కోట్లు కార్పొరేషన్పై భారం పడిందన్నారు. ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంటే ఉద్యోగులు సమ్మెలోకి దిగడం అన్యాయమని ప్రకటించాలని కోర్టును కోరారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల కారణంగా ఆర్టీసీ డిమాండ్లను పరిష్కరించలేదని, డిమాండ్లను ఆమోదిస్తే ఆర్టీసీ మరింతగా దిగజారిపోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సమ్మె చట్ట వ్యతిరేకమని వెల్లడించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
పంతాలకు పోవద్దు: హైకోర్టు
పంతాలకు ఎందుకుపోతున్నారు.. సమస్య సాధన దిశగా ప్రభుత్వం ఆలోచనలు, అడుగులు ఉండాలని హైకోర్టు వాదనల సందర్భంగా అభిప్రాయపడింది. కార్మిక శాఖలో కార్మిక వివాదాల పరిష్కార అధికారి వద్ద సమస్యను తేల్చుకోవాలనీ, హైకోర్టులో కాదని అదనపు ఏజీ చెప్పగానే, కార్మిక శాఖ వద్ద కూడా ప్రతికూల ఫలితం వస్తే అప్పుడు ఏం చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ ఎండీని నియమించాలన్న సూచనను ఎందుకు పాటించలేదో చెప్పాలని నిలదీసింది. సమ్మె నేపథ్యంలో కొత్త వ్యక్తిని ఎండీగా వేస్తే ఇప్పుడున్న సమస్యల్ని అర్ధం చేసుకుని చర్యలు చేప ట్టేందుకు సమయం పడు తుందని అదనపు ఏజీ బెంచ్కు వివరించారు. ఎండీని నియమిస్తే కార్మికుల్లో నమ్మకం ఏర్పడుతుందనీ, అయినా ఎండీ జీతమేమీ జేబుల్లోంచి ఇవ్వడం లేదు కదా అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కనీస చర్యలు తీసుకున్నట్టుగా అనిపించడం లేదనీ, సగానికిపైగా డిమాండ్లను ఎలాంటి అడ్డు లేకుండా పరిష్కరించవచ్చునని హైకోర్టు అభిప్రాయపడింది.