Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
- చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించాలి
- ఐక్యకార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కమిషనరేట్ ముట్టడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను బతికించేందుకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు... ప్రయివేటీకరణ నిర్ణయాన్ని సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలి... ఉద్యోగులను చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఐక్యకార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాద్లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు కమిషనరేట్ను దిగ్భంధనం చేసి, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 15 రోజులుగా న్యాయమైన కోర్కెల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడుతుంటే రాష్ట్ర కార్మికశాఖ నిద్రమత్తులో జోగుతుందని విమర్శించారు. జవాబుదారీతనం వహించని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజరుకుమార్, కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డిలు వెంటనే రాజీనామా చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా సీఐటీయూ, ఎఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం. సాయిబాబు, వి.ఎస్.బోస్లు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమంగా మారిందని, కార్మికోద్యమాన్ని అణచివేసే చర్యలను రాష్ట్ర కార్మికవర్గం ప్రతిఘటించి తీరుతుందని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హమీలనే కార్మికులు అడుగుతున్నారనీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే మరో సకల జనుల సమ్మె తప్పదని తెలిపారు. కార్మికులు సంస్థను బతికించుకునేందుకు పాటుపడుతుంటే, ప్రభుత్వం మాత్రం తన అసంబద్ద నిర్ణయాలతో నష్టాల ఊబిలోకి నెడుతున్నదని విమర్శించారు. మహిళలకు, విద్యార్థులకు భద్రత కల్పించే ఏకైక రవాణా వ్యవస్థ ఒక్క ఆర్టీసీ మాత్రమేనని గుర్తు చేశారు. అలాంటి సంస్థను ప్రైవేటు పరం చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గుతాయన్నారు. ప్రైవేటు ఆపరేటర్లు లాభాలు వచ్చే రూట్లలో మాత్రమే బస్సులను నడుపుతారని, మారుమూల గ్రామాల ప్రజలు రవాణాకు దూరమవుతారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన మొండి వైఖరి విడనాడి తక్షణమే కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెను నిర్లక్ష్యం చేస్తే ప్రజాకోర్టులో కేసీఆర్కు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు గంటలకు పైగా ధర్నా చేయడంతో కమిషనరేట్ కార్యకలాపాలు ఆగిపోడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్టు సందర్భంగా కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శాంతియుతంగా తాము ఆందోళన చేస్తుంటే అరెస్టులు అన్యాయమని కార్మికనేతలు ప్రతిఘటించడంతో బలవంతంగా వారిని పోలీసు వ్యాన్ ఎక్కించి సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. సుధాభాస్కర్, భూపాల్, ఎస్. రమ, రాష్ట్ర కార్యదర్శు లు పి. జయలక్ష్మి, వంగూరు రాములు, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి విజరుకుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.కె. బోస్, టీఎంఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ. రాజుభట్, ఇతర నాయకు లు ఎం. వెంకటేష్, వాణి, బి. వెంకట ేష్, సత్యనారాయణ, ఎ. నాగేశ్వరరావు, వై. సోమన్న తదితరులు పాల్గొన్నారు.