Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు
- సూర్యాపేటలో మంత్రి జగదీశ్కు సమ్మె సెగ
- కోదాడలో శాసనమండలి చైర్మెన్ కాన్వారు అడ్డగింత
- పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట
- ఇద్దరు మహిళా కండక్టర్లకు గాయాలు
నవతెలంగాణ-యంత్రాంగం
సమ్మెలో వెనక్కి తగ్గకుండా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల నిరసన సెగ ప్రజాప్రతినిధులకు తగిలింది. 34వ రోజు సమ్మెలో భాగంగా గురువారం సూర్యా పేటలో సీపీఐ(ఎం), వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ర్యాలీలు తీశారు. మంత్రి జగదీశ్రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనలో ఇద్దరు మహిళా కండక్టర్లకు గాయాలయ్యాయి. పోలీసులు పలువురిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. కోదాడలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి కాన్వారును అడ్డుకున్నారు. సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదనీ, వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలనీ నినాదాలు చేశారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం గడువు విధించినా లెక్కచేయని ఆర్టీసీ కార్మికులు ప్రజాసంఘాలు, వామపక్ష, ఇతర పార్టీల మద్దతుతో నిరసనలు హోరెత్తిస్తున్నారు. సమ్మె పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సమ్మె, కార్మికులకు మద్దతుగా పలువురు విరాళాలందజేశారు. మిర్యాలగూడలో డిపో ఎదుట ధర్నా చేయగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. నల్లగొండలో కార్మికులు సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ, చౌటుప్పల్, యాదగిరిగుట్టలో ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జిల్లా కార్యదర్శి ఎం.డి.జహంగీర్ మద్దతు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్ వల్ల వనపర్తి జిల్లాలో మదనాపురం మండలంలో గోవిందహల్లిలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢకొది. నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదిలాబాద్, మంచిర్యాలలో వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జన్నారంలో ఆర్టీసీ కార్మికులు ముఖాలకు నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ ఎదుట, నిర్మల్లో, కామారెడ్డిలో రాస్తారోకో చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు, అక్కడినుండి బస్టాండ్కు ర్యాలీ నిర్వహించి బస్సులను అడ్డుకున్నారు. కార్మికుల కోసం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దీక్షా శిబిరం కొనసాగింది. పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు యాద అశోక్ రూ.2వేల సాయాన్ని కార్మికులకు అందజేశారు. సీఐటీయూ, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ ప్రదర్శన, ర్యాలీ చేశారు. జగిత్యాల జిల్లాకేంద్రంలో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. మెట్పల్లి డిపో ఎదుట ఓ ఆర్టీసీ మెకానిక్ చిన జియర్స్వామి వేషాధారణలో ఉండగా కార్మికులు ఆయన కాళ్లు మొక్కి సీఎం కేసీఆర్ మనసు మార్చాలని కోరారు. ఖమ్మంలో రీజియన్ వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో తెల్లవారుజామునే డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. కొత్తగూడెం బస్డిపో గేటువద్ద బైటాయించి బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని పొర్లుదండాలు పెట్టారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు మద్దతు తెలిపారు. మోత్కూరులో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్లో. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఓయూ ప్రొఫెసర్ జ్యోత్య్న కార్మికులకు మద్దతు తెలిపారు. నాగర్కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ కార్మికుల దీక్షకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్లు ఊడ్చి కార్మికులు నిరసన తెలిపారు. హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధూమ్ ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిల్సుఖ్నగర్ డిపో ఎదుట నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బిక్షాటన చేశారు. కూకట్పల్లిలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు.
విరాళాల సేకరణ
ఆర్టీసీ కార్మికుల సహాయార్థం గురువారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మాల్ వ్యాపార కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కోర్కమిటీ సభ్యులు మధుసూధన్రెడ్డి ఆధ్వర్యంలో రూ.5,060ను జేఏసీ నాయకులకు అందజేశారు. ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నాయకులు రూ. 6,062ల విరాళాలు సేకరించి ఆర్టీసీ జేఏసీ నాయకులకు అందజేశారు.
విధుల్లో చేరి..మళ్లీ సమ్మె బాట..
ప్రభుత్వ డెడ్లైన్కు భయపడి విధుల్లో చేరిన మహబూబ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు భాస్కర్నాయక్, మహ్మద్ అసన్ గురువారం మళ్లీ సమ్మెలో చేరారు. జీతాలు లేక కుటుంబపోషణ భారమై చాలా ఇబ్బందులు పడుతున్న తాము బతకలేని స్థితిలో విధుల్లో చేరామని చెప్పారు. పోరాటం ద్వారా హక్కులు సాధించొచ్చని మళ్లీ సమ్మెలో చేరినట్టు తెలిపారు.