Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరికొద్ది రోజుల్లో పీఆర్సీ నివేదిక
- కసరత్తు వేగవంతం
- త్వరలో సీఎంకు సమర్పించనున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ)పై ప్రభుత్వం కసరత్తులను వేగవంతం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులు లెక్కలు, గణాంకాలేసుకుంటున్నట్టు సమాచారం. ఉద్యోగ సంఘాలు 63 శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) అమలవుతున్నది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కారు 2015లో 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించింది. దీంతో ప్రస్తుతం అప్పటి కంటే ఎక్కువగా ఇప్పుడు ఫిట్మెంట్ను ఇస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే ఈసారి 25 శాతానికి మించి ఫిట్మెంట్ ఇచ్చే అవకాశాల్లేనట్టు తెలుస్తున్నది. ఆర్థికమాంద్యం నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయాలు, రాబడులు తగ్గుతున్నాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన విషయం విదితమే. ఫిట్మెంట్ తగ్గించటానికి ఇదే కారణమని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీఆర్సీ నివేదికను సమర్పించాలంటూ బిశ్వాల్ కమిటీని సీఎం కోరిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో సదరు కమిటీ తన రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేయనుంది. 'ఇప్పటికే నివేదిక సీఎం కార్యాలయానికి అంది ఉంటుంది. కాకపోతే ఫిట్మెంట్పై క్లారిటీ వచ్చిన తర్వాతే దాన్ని బహిర్గతం చేయొచ్చు...' అని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీఆర్సీపై వివిధ శాఖలు, విభాగాధిపతులు ఇప్పటికే తమ వద్దనున్న ఉద్యోగులు, సిబ్బంది సంఖ్యకు సంబంధించిన లెక్కలు తీస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ ఆర్థికశాఖకు సమర్పించనున్నారు. ఆ శాఖ అంచనాల ప్రకారం... ఒక్క శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలంటే రూ.250 కోట్లు అవసరమవుతాయి. ఈ చొప్పున మొత్తం 25 శాతానికి రూ.6,250 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఆర్సీ కోసం ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించలేదు. అలాంటప్పుడు పీఆర్సీ అమలు కోసం డబ్బులను ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నిధులను సర్దుబాటు చేయటం ఇబ్బందిగా మారితే.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచి దీన్ని అమలు చేస్తారా..? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది.