Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు డిపోలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు
- పట్టుదలగా పోరాడుతున్న ఆర్టీసీ కార్మికులు ొ జేఏసీ నేతలపై పోలీసుల దౌర్జన్యం
- ప్రజాస్వామ్యంలో ఉన్నామా... నిజాం, బ్రిటీషు పాలనలో ఉన్నామా?
- రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
- సీఎం మొండివైఖరి వీడి చర్చలు జరపాలి: వామపక్ష నేతలు తమ్మినేని, రంగారావు, సుధాకర్, తాండ్రకుమార్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం దమనకాండకు దిగిందని వామపక్ష నేతలు విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుల ఇండ్లపై దాడులు చేయడం, గృహనిర్బంధం విధించడం, కొందరిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, నిరాహారదీక్షలు చేసే హక్కు లేదా?అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిజాం పాలనలో, బ్రిటీషు కాలంలో ఉన్నామా?అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని విమర్శించారు. ఆర్టీసీ జేఏసీ మెట్టుదిగొచ్చి విలీనం డిమాండ్ను పక్కన పెట్టినా ప్రభుత్వం పట్టించుకోదా?, చర్చలు జరపదా?అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు, పోలీసుల దౌర్జన్యంపై ఆదివారం ఆర్టీసీ డిపోలు, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం, నంద్యాల నర్సింహారెడ్డి, టి జ్యోతి (సీపీఐఎం), డి సుధాకర్, రాములు యాదవ్ (సీపీఐ), పోటు రంగారావు, కె రమ, హన్మేష్, కెఎస్ ప్రదీప్ (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), తాండ్రకుమార్ (ఎంసీపీఐయూ), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ మొండివైఖరి వీడాలి : తమ్మినేని
43 రోజులుగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మొదటిరోజు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో 43వ రోజూ అంతే పట్టుదల, ఐక్యంగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. సమ్మె పరిష్కారానికి పెద్దమనుషులు, హైకోర్టు, రాజకీయ పార్టీల నాయకులు ఎంతో కృషి చేశారని వివరించారు. సమ్మెకు ప్రజల మద్దతు లభించిందన్నారు. సీఎం కేసీఆర్ మొండివైఖరితో పరిష్కారం కావడం లేదని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత దౌర్జన్యాన్ని ఈ ప్రభుత్వం ప్రయోగిస్తున్నదని విమర్శించారు. సుప్రీం న్యాయమూర్తుల కమిటీ అంగీకరించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ నాయకులు నిరవధిక నిరాహారదీక్ష పూనుకుంటే, అనుమతి ఇవ్వకపోగా పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇది అప్రజాస్వామికమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా?లేక నిజాం పాలనలో ఉన్నామా?, బ్రిటీషు కాలంలో ఉన్నామా?అన్న అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఇంత దౌర్జన్యం గతంలో చూడలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని, 50 వేల కుటుంబాలను రోడ్డున వేయొద్దని కోరారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆలోచించాలని సూచించారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సమ్మెకు మద్దతు ఇవ్వడం, కేంద్రం స్పందించకపోవడం ద్వంద్వవైఖరి అర్థమవుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వాటా ఉన్నదని, చట్టబద్ధంగా ఆర్టీసీ విభజన కాలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. సామరస్యంగా పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. ఈనెల 18న హైకోర్టు సమ్మె పరిష్కారానికి స్పష్టమైన ఆదేశాలిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. కోర్టులో తప్పుడు వివరాలతో ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేస్తున్నదని విమర్శించారు. రూ.47 కోట్లిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీని ప్రయివేటుపరం చేసి, రూ.80 వేల కోట్ల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు అమ్ముకోవాలన్నదే ప్రభుత్వ అసలు రహస్యమని అన్నారు. అందుకే చర్చలు జరపడం లేదన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా సమాధానం చెప్తారని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ ప్రయివేటుపరం అయితే ఎస్సీ,ఎస్టీ,బీసీలకే ఎక్కువ నష్టం కలుగుతుందని చెప్పారు. రిజర్వేషన్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు వర్తించబోవని అన్నారు. తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీలకు ప్రయోజనం కలిగించే డిమాండ్ల కోసమే సమ్మె జరుగుతున్నదని వివరించారు.
ఇందుకోసమా తెలంగాణ కోసం కొట్లాడింది : పోటు రంగారావు
రాష్ట్రంలో కనీస ప్రజాస్వామిక హక్కులు లేకుండా కాలరాయడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు. ఇందుకోసమేనా తెలంగాణ కోసం కొట్లాడింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడం అన్యాయమన్నారు. బ్రిటీషు కాలంలోనూ గాంధీ అనేక దీక్షలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నిజాం రాజ్యంలోనూ గోల్కొండ పత్రిక, సురవరం ప్రతాప్రెడ్డి నిరసన గళం వినిపించారని చెప్పారు. ఉమ్మడి ఏపీలో అనేక ఉద్యమాలు జరిగాయని, బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం పెద్దఎత్తున జరిగాయన్నారు. కానీ బంగారు తెలంగాణలో నిరసనలకు, నిరాహారదీక్షలకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. దీక్షలకు అనుమతి ఇవ్వకపోగా యూనియన్ కార్యాలయాన్ని దిగ్బంధించడం, జేఏసీ నాయకుల ఇండ్లను పోలీసులు ముట్టడించడం, అరెస్టు చేయడం ఎమర్జెన్సీని తలపిస్తున్నదని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి సుధాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పి ఇప్పుడు గుండెల్లో గునపాలు గుచ్చుతున్నారని విమర్శించారు. విలీనం డిమాండ్ను పక్కన పెట్టినా ఇంత దమనకాండ ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్లో రోడ్లన్నీ యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బేషజాలు వదిలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఓపికగా, సహనంతో సమ్మె చేస్తున్నారని చెప్పారు. ఓపిక, సహనం నశించకముందే ప్రభుత్వం సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విలీనం డిమాండ్ను పక్కనపెట్టినా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు.