Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాజకీయ కుట్రలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు అంటూ పేర్కొనటం అత్యంత శోచనీయమని ఆర్టీసీ జేఏసీ నాయకులు, ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శించారు. ఆ అఫిడవిట్ టీఆర్ఎస్ కరపత్రం లాగా ఉందని వారు వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నర్సింహా రావు, జి.రాములు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర రావు, మోహనరెడ్డి (బీజేపీ), ఇందిర (కాంగ్రెస్), రమ, సూర్యం (న్యూడె మోక్రసీ) తదితరులు సమావేశమయ్యారు. జేఏసీ నేతల నిరవధిక నిరాహారదీక్షలు, కోర్టుకు సీఎస్ సమర్పిం చిన అఫిడవిట్, సడక్ బంద్ తదితరాంశాలపై వారు చర్చించారు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీఎస్ వాస్తవాలు చెప్పకుండా మరుగుపరిచారని సమావేశంలో పాల్గొన్న నేతలు విమర్శించారు. కార్మికులను బెదిరించే ధోరణిలో సర్కారు వ్యవహరిస్తున్నదని చెప్పారు. కార్మికులు ఒక మెట్టు దిగి విలీనం అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెడుతు న్నామని చెబుతున్నా ప్రభుత్వం, ముఖ్యమంత్రి పట్టించుకోకవటం శోచనీయమన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ ప్రతినిధుల్లాగా వ్యవహరిస్తు న్నారంటూ వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జేఏసీతో చర్చలు జరపాలనీ, తద్వారా సమ్మెను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు. మంగళవారం నిర్వహించతలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.