Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన పురపోరు..
- ఓటర్లను మళ్లిస్తున్నారని పరస్పరం దాడులు
- చెదరగొట్టిన పోలీసులు.. పలుచోట్ల లాఠీచార్జి
- కేంద్రాల వద్ద డబ్బు, ముక్కు పుడకలు పంపిణీ
అక్కడక్కడ చెదురు ముదురు ఘటనలతో పురపోరు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటలవరకు 71.41 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పోచంపల్లి మున్సిపాలిటీలో (95.13 శాతం) నమోదు కాగా.. నిజాంపేట కార్పొరేషన్లో (39.65 శాతం)అత్యల్పంగా ఓటింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పుర ఎన్నికల్లో...ఆయా పార్టీల నేతలు ప్రలోభాలతో ఓటర్లను ప్రభావితం చేశారు. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే డబ్బులు,ముక్కుపుడకలు పంపిణీ చేశారు. బలమున్న వార్డుల్లో దొంగఓట్లు వేయించుకోవటానికి అభ్యర్థులు పోటీపడ్డారు. ఉద్రిక్తత నెలకొన్న కేంద్రాల వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేశారు. బోధన్లో అధికారపార్టీ అభ్యర్థిని కాంగ్రెస్పార్టీ అభ్యర్థి ముక్కు కొరికాడు.
పోలింగ్ సజావుగా జరగటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాము నిద్రాహారాలు మాని ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించామని అభ్యర్థులు అంటున్నారు. మరి ఈ గెలుపుఓటములు తెలియాలంటే 25 వరకు (శనివారం) ఓపిక పట్టాల్సిందే.
నవతెలంగాణ-మొఫిసిల్ యంత్రాంగం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుజిల్లాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనీ, డబ్బు పంపిణీ చేస్తున్నారనీ పలు పార్టీల నాయకులు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు ఎక్కడికక్కడ చెదరగొట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లాఠీచార్జి చేశారు. బోధన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ముక్కు, చేతివేళ్లను కాంగ్రెస్ అభ్యర్థి కొరకడంతో తీవ్రంగా గాయమైంది. మిర్యాలగూడలో దొంగ ఓటర్లతో ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ నేతలు యత్నించగా సీపీఐ(ఎం), కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎస్సై వారిని విచక్షణారహితంగా కొట్టారు. కామారెడ్డిలో ఓ అభ్యర్థి తరపున ముక్కు పుడకలు పంపిణీ చేయగా పోలీసులు పట్టుకున్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ పలు వార్డుల్లో టీఆర్ఎస్ నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిడుగురాళ్లకు చెందిన 200 మందిని రెండు బస్సుల్లో తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇందిరమ్మకాలనీ బూత్లోకి రావడాన్ని గ్రహించిన సీపీఐ(ఎం), కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోగా వాడపల్లి ఎస్సై వారిపై దాడికి దిగారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్నాయక్ చేరుకుని ధర్నా చేపట్టారు. 30వ వార్డు బంగారుగడ్డలో ఒకే ఇంటి నెంబర్పై 25 మంది ఓట్లు నమోదుకావడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఓటువేయిస్తున్నారని వాగ్వాదం జరిగింది. నల్లగొండ 33వ వార్డులో పురుషుని బదులు మహిళా స్లిప్ తీసుకొని ఓటు వేసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతను పలువురు అడ్డుకుని పంపించేశారు. హాలియాలోని 12వ వార్డులో ఒకరికి బదులు మరొకరు ఓటు వేశారు. తమకు వ్యతిరేకంగా ఎలా పోటీ చేస్తావంటూ టీఆర్ఎస్కు చెందిన కొందరు కార్యకర్తలు మిర్యాలగూడ 9వ వార్డు నుంచి పోటీచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి లావూరి సరోజన భర్తపై దాడిచేశారు.
నిజామాబాద్లోని మాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద అనుమానస్పదంగా కనిపించిన పది మంది ముస్లిం మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఓట్లు వేసేందుకు డిచ్పల్లి నుంచి వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బోధన్ మున్సిపాలిటీలోని 32వ వార్డులో పలువురు దొంగ ఓట్లు వేస్తున్నారని, ఆధార్కార్డు పరిశీలించాలని టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ షరీఫ్ పేర్కొనడంపై కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ అలీ దాడి చేశాడు. ముక్కు, చేతి వేళ్లు కొరకడంతో తీవ్రంగా రక్తం కారింది. ఆర్మూర్లో 4, 21 పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఆయా పార్టీల నాయకులు గూమిగూడటంతో పోలీసులు లాఠీచార్జితో చెదరగొట్టారు. 30వ వార్డులో దొంగ ఓట్లు వేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. బాన్సువాడలో 3వార్డులో స్పీకర్ పోచారం శ్రీనివాసర్రెడ్డి కుమారుడు భాస్కర్రెడ్డి పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఎన్నికల కేంద్రానికి రావడం కొంత ఉద్రిక్తత సృష్టించింది.
జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. పెద్దపల్లి జిల్లా 19వ వార్డులో లాఠీచార్జి చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో టీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థుల వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సంగారెడ్డిలోని 23వ వార్డులో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేశాడని ఇరు పార్టీల నాయకులు తోసుకోవడంతో స్వల్ప గాయాలయాయయి. జోగులాంబ గద్వాల మున్సిపల్లో ఎంఐఎం, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. నాగర్కర్నూల్ మున్సిపల్ ఆరో వార్డులో టీఆర్ఎస్ నాయకులు, రెబెల్స్ మధ్య స్వల్ఫ ఘర్షణ జరిగింది.
యథేచ్ఛగా డబ్బు పంపిణీ
ఖమ్మం జిల్లా సత్తుపల్లి 14వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గుండ్ర రాఘవేంద్ర తరపున ఆ పార్టీ కార్యకర్త వెనిగల్ల గోపీ డబ్బులు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 9వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఎన్డీ నాయకుడు ఆవునూరి మధు గుర్తించాడు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగడంతో లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఆలేరులోని 4వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి తరపున ఓ ఆటో డ్రైవర్ డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. చిట్యాలలోని 7వ వార్డు స్వతంత్య్ర అభ్యర్థి గంటెపాక స్వామి సతీమణి డబ్బులు పంపిణీ చేస్తుండగా 9వేలు పట్టుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు ఓటర్లకు కరచాలనం చేస్తున్నట్టు చేసి చేతులో రూ.500 నోట్లు పెట్టారు. 11వార్డు రాంనగర్లో ఓటరుకు బీజేపీ అభ్యర్థి సంజరు తమ పార్టీకి ఓటేయాలని చెబుతుండగా టీఆర్ఎస్ కార్యకర్త అన్వర్ అతనిపై కర్రతో దాడి చేయడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జల్పల్లిలో నకిలీ ఐడీ కార్డులతో..
దుండిగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వారి నుంచి రూ.50వేలు లాక్కొని పోలీసులకు అప్పగించారు. మీర్పేట్ 37 వార్డులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సల్ప ఘర్షణ నెలకొన్నది. 32వార్డులో బీజేపీ నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేయగా గమనించి నలుగురిని పోలీసులకు అప్పగించారు. 29 వార్డులో బీజేపీ నాయకులు ముగ్గురు కాలేజీ విద్యార్థులతో ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలో శ్రీనివాస్రెడ్డి డబ్బులు పంచుతున్నాడని అనుమానించిన టీఆర్ఎస్ అభ్యర్థి జడిగే రమేష్ యాదవ్ దాడికి పాల్పడాడు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంటవార్డులోని 79 పోలింగ్ కేంద్రాల్లో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఓట్లు వేయడానికి వచ్చిన 11మందిని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. బండంగ్పేట్ 14వ డివిజన్లో డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్, రెబెల్ అభ్యర్థి మధ్య గొడవ జరిగింది.
పోలీసులపై నిజామాబాద్ ఎంపీ చిందులు
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్లు టీఆర్ఎస్కు, కాంగ్రెస్, బీజేపీకి మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కార్పొరేషన్లోని 41వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి, నేతలు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పోలీసులు లాఠీఛార్జి చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. 'టీఆర్ఎస్ ఏజెంట్లను పోలీసులుగా నియమించారు. చేతకాని డిపార్ట్మెంట్ అయ్యింది. మా అభ్యర్థిని ఎలా అరెస్టు చేస్తారు? మర్డర్ చేసిండా' అంటూ ఎంపీ అరవింద్ వారితో ఘర్షణకు దిగారు. లాఠిఛార్జి చేసిన మూడో టౌన్ ఎస్ఐని ఎంపీ దూషించారు. 'ఆ ఎస్సై చిల్లరగాడు. సిగ్గులేని డిపార్ట్మెంట్ తయారయ్యింది. మహిళలను కొట్టేందుకు సిగ్గుండాలి. వాడ్ని(ఎస్సై) చావకొడతాం' అన్నారు. పోలీసులు యూనిఫామ్లు తీసి టీఆర్ఎస్ కండువాలు కప్పుకోవాలన్నారు.
ఓటు వినియోగించుకున్న 34,95,322 మంది
మున్సిపల్ ఎన్నికల్లో 34,95,322 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ వివరాలను ప్రకటించింది. మొత్తం 3052 వార్డులకు గాను 2971లలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం ఓటర్లు 49,75,093 ఉన్నారు. వీరిలో పురుషులు 24,90,316 మంది ఉండగా 17,13,291 మంది, మహిళలు 24,84,454 మందికిగాను 17,37,714 మంది ఓటు వినియోగించుకున్నారు. ఇతరులు 323 మంది ఉండగా 27 మంది ఓటు వేశారు.