Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులను వదలనంటున్న ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు
- వాళ్ల కండ్లకు కావలి కాస్తామనేలా చక్కర్లు
- మేయర్, చైర్మెన్ పదవులు దక్కించుకునేందుకు ఎత్తుగడలు
- టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు బస్సుల్లో తరలింపులు
- గులాబీ భయంతో కట్టుదిట్టమైన కాంగ్రెస్
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి, ఆదిలాబాద్
మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు ముందు జరుగుతున్న పరిణామాలు తెలంగాణ రాజకీయాలను రసకందాయంలో పడేస్తున్నాయి. పుర ఎన్నికల వాడీవేడి సమయం, ఆ వాతావరణం ఇంకా ముగిసినట్టుగా కనిపించడం లేదు. అనుకున్న పదవులు దక్కిం చుకునేందుకు అధికార పార్టీ సహా ఇతర పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ఎత్తు గడలు, వ్యూహాలతో అటు అభ్యర్థులను, ఇటు జిల్లావ్యాప్త రాజకీయాలను హౌరెత్తి స్తున్నాయి. అభ్యర్థులు చేజారిపోకుండా అధిష్టానాల సూచన మేరకు వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న అనుమానాలతో అభ్యర్థుల చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉదయం లేచింది మొదలు ప్రశాంతంగా నిద్రపోయేవరకూ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వారిని పర్యవేక్షిస్తూ, కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కొడుకును చైర్మెన్ చేసేందుకు జోగురామన్న క్యాంపు..
ఆదిలాబాద్ జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తన తనయుడిని చైర్మెన్ చేసేందుకు శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థులను రెండుబస్సుల్లో క్యాంపునకు తరలించారు. జోగు ప్రేమేందర్ను చైర్మెన్ పీఠంపై కూర్చొబెట్టేందుకు మొదట్నుంచీ ఆయన గట్టి ప్రయత్నమే చేశారు. ఏకగ్రీవానికి యత్నించగా చివరి నిమిషంలో విఫలమైంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా టీఆర్ఎస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. కాంగ్రెస్ 46, బీజేపీ 45, ఎంఐఎం 18, టీడీపీ 6, సీపీఐ 4, సీపీఐ(ఎం) 2 వార్డుల్లో పోటీకి దిగాయి. పార్టీ అభ్యర్థులతో పాటు 116 మంది స్వతంత్రులూ బరిలో ఉన్నారు. మొత్తం 49 స్థానాలకు 286 మంది పోటీ పడ్డారు. శనివారం ఓట్ల లెక్కింపు దృష్ట్యా ముందు జాగ్రత్తగా తమ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే క్యాంపునకు తరలించారు. తమ పార్టీకే మెజార్టీ స్థానాలు వస్తాయని ధీమా ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీతో పాటు పలు వార్డుల్లో స్వతంత్రులు గట్టిపోటీ నిచ్చినట్టు పోలింగ్ సరళి తెలియజేస్తోంది.
జగ్గారెడ్డి క్యాంపు బాట..
సంగారెడ్డి జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. సంగారెడ్డి మున్సిపల్కు తీవ్ర పోటీ నెలకొంది. 38 వార్డులున్న మున్సిపల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ పదవిని దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. చైర్పర్సన్ కావాలనుకుంటున్న మహిళా అభ్యర్థి భర్త తోటి అభ్యర్థులకు రూ.10లక్షలు, కారును నజరానాగా ప్రకటించారు. కాంగ్రెస్కు చెందిన 38 మంది అభ్యర్థులు ఎలాగైనా మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో క్యాంపు బాట పట్టారు. ప్రత్యేక బస్సులో కుటుంబ సభ్యులతో సహా కర్నాటకకు వెళ్లారు. టీఆర్ఎస్కు చెందిన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, నాయకులు ఆర్థిక మంత్రి హరీశ్రావుతో సమావేశమై ఆయన సూచనల మేరకే కార్యచరణ చేపట్టబోతున్నట్టు తెలిసింది. సదాశివపేట మున్సిపాలిటీలో 25 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, 25 మంది కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంపు వెళ్లారు. మిగతాచోట్ల క్యాంపులకు వెళ్లకుండానే మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్ శివారులో కాంగ్రెస్ అభ్యర్థులు...
గెలచినోళ్లు గులాబీ గంపలోకి పోతారన్న భయంతో కాంగ్రెస్ ముందుగానే క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, చండూరు, చిట్యాల పురపాలికల్లో ఈ నెల 27న చైర్మెన్గిరిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ వేస్తోన్న ఎత్తులను గులాబీ ఎమ్మెల్యేలు అధికార, ధన బలంతో చిత్తుచేసేందుకు రంగంలోకి దిగారు. యాదగిరిగుట్టలో 12వార్డుల్లో కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 2, టీఆర్ఎస్ రెబెల్స్ ముగ్గురు అభ్యర్థులు గెలుస్తారని సర్వేల్లో వెల్లడైంది. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి ఇలాకా చండూరులో 10 స్థానాలకు కాంగ్రెస్ 6, టీఆర్ఎస్ నాలుగింట్లో గెలిచే అవకాశముంది. మాజీ ఎమ్మెల్యే వీరేశం అనుచరులకు టికెట్ ఇవ్వకపోవడంతో రెబెల్గా పోటీచేయడంతో చైర్మెన్ పీఠం దక్కించుకోలేమని గులాబీ పెద్దలు సీన్లోకి ఎంట్రీ అయ్యారట. కాంగ్రెస్ విజేతలను కొనేందుకు బేరసారాలకు దిగడంతో కాంగ్రెస్ కూటమి లీడర్ రవీందర్రెడ్డి అప్రమత్తమై టీఆర్ఎస్ రెబెల్స్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను శిబిరానికి తరలించారు. కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కనుసన్నుల్లో క్యాంపులు నడుస్తున్నట్టు వినికిడి. హైదరాబాద్ చుట్టూ రింగ్రోడ్డుకు ఆనుకొని ఉన్న రిసార్టులు, ఫామ్హౌజ్లను క్యాంపు కోసం వాడుకుంటున్నట్టు తెలిసింది. రీకౌంటింగ్ జరిగితే అభ్యర్థి తప్పనిసరి కావడంతో శనివారం ఉదయం ప్రత్యేక వాహనాల్లో వారిని కౌంటింగ్ జరిగే సమీపప్రాంతాలకు తీసుకువెళ్లనున్నారు. ఫలితాల అనంతరం గెలిచినవారితో లాంగ్జర్నీ చేయించనున్నారు. ఈ జర్నీలోనే చైర్మెన్ కావడం కోసం విజేతలైన కౌన్సిలర్లతో లావాదేవీలు జరపనున్నారు.
పేర్లన్నీ సీల్డ్ కవర్లోనే..?
మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎన్నిక సందర్భంగా అభ్యర్థుల పేర్లు అధికార పార్టీ సీల్డ్ కవర్లోనే చేరవేయనున్నట్టు తెలిసింది. ఆ పదవులకు సంబంధించి అధిష్టానం ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నట్టు, వాళ్ల పేర్లను ఇప్పటికే ఖరారు చేసినట్టు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్, మునిపాలిటీల్లో పోటీచేసిన అభ్యర్థులతో మంత్రి మల్లారెడ్డి సమావేశమైన సందర్భంగా ఈ విషయం చెప్పారు. పదవి విషయంలో పట్టుబట్టొద్దనీ, సొంత నిర్ణయాలు మానుకోవాలనీ ఆయన ఘాటుగానే చెప్పినట్టు ఓ నేత వెల్లడించాడు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే విప్ జారీ చేస్తామనడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. సీట్ల కేటాయింపులోనూ మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే.