Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏ వ్యతిరేక సభపై లాఠీచార్జి
- విద్యార్థులు, విద్యావంతులకు గాయాలు
- మీడియా ప్రతినిధులపైనా పోలీసుల దాడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
భీంఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ఆజాద్ను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా వివిధ పార్టీలు, విద్యావంతులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వ హించ తలపెట్టిన బహిరంగ సభకు వచ్చిన చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగిన ఆజాద్ను తిరిగి ఢిల్లీ వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. భీంఆర్మీ కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు పోలీసుల నుంచి తప్పించి, మాసబ్ట్యాంక్లోని గొల్కొండ హౌటల్లో ఆయనను ఉంచారు. విషయం తెలుసుకున్న పోలీసులు బలవంతంగా హౌటల్ గది ఖాళీ చేయించి బయటకు పంపించారు. చేసేదేమిలేక ఆజాద్ అతని అనుచరులు మల్లెపల్లిలోని ఓ మిత్రుడి వద్ద ఉండిపోయారు. అక్కడికీ వెళ్లిన పోలీసులు ఆ ఇంటిపై దాడిచేసి అతన్ని అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే సాయంత్రం మెహిదీపట్నంలోని క్రిస్టల్ గార్డెన్స్లో జరగాల్సిన బహిరంగ సభకు పెద్దసంఖ్యలో తరలిరావడంతో అనుమతిలేదంటూ పోలీసులు వారిని పంపించేందుకు ప్రయత్నించారు. అనుమతులున్నాయంటూ నిర్వాహకులు చెప్పేందుకు యత్నించినా పోలీసులు వినలేదు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలను చిత్రీకరిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, అడ్డొచ్చిన మీడియా ప్రతినిధులపైనా పోలీసులు దాడికి దిగారు. కెమెరాలను లాక్కుని హంగామా సృష్టించారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులు, నేతలు గాయపడ్డారు.