Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు ఉదాసీనత
- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం
- షరతులతో అనుబంధ గుర్తింపు
- హైకోర్టు వ్యాఖ్యలపై ఏం చేద్దాం
- అధికారుల మల్లగుల్లాలు
- రేపు విద్యాశాఖ కీలక సమావేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ కాలేజీల పట్ల ఇంటర్ బోర్డు ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నది. అనుబంధ గుర్తింపు లేకున్నా కొనసాగించేందుకు ఏటా షరతులతో అనుమతి ఇస్తున్నది. ఫైర్ ఎన్ఓసీ లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును సాకుగా చూపి ఆ కాలేజీలు ఏటా అనుబంధ గుర్తింపును పొందుతున్నాయి. ఫైర్ ఎన్ఓసీ లేకుంటే గుర్తింపు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా ఇంటర్ బోర్డు దాన్ని పట్టించుకోవడం లేదు. ఏటా అదే తప్పు చేస్తున్నది. షరతులతో గుర్తింపు ఇస్తున్నది. నిబంధనలు పాటించకపోయినా ఆ కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు వెనకడుగు వేస్తున్నది. కార్పొరేట్ కాలేజీల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నందుకే బోర్డు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కార్పొరేట్ కాలేజీలపై ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు సోమవారం ఇంటర్ బోర్డును ప్రశ్నించింది. ఆ కాలేజీలతో కుమ్మక్కయ్యారా?అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇంటర్ బోర్డు అధికారులు ఏం చేయాలనే దానిపై సమాలోచన చేస్తున్నారు. హైకోర్టుకు ఏం వివరాలు సమర్పించాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. గురువారం హైకోర్టు ఆదేశాలపై విద్యాశాఖ అధికారులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరంలో 2,786 జూనియర్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేశాయి. వాటిలో 2,570 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. వాటిలో ప్రయివేటు జూనియర్ కాలేజీలు 1,701 దరఖాస్తు చేస్తే, 1,486కు గుర్తింపు వచ్చింది. 215 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఫైర్ ఎన్ఓసీ లేకుండా 83 కాలేజీల వరకు ఉన్నాయి. వాటిలో శ్రీచైతన్య, నారాయణ, శ్రీగాయత్రి, ఎన్ఆర్ఐ కాలేజీలున్నాయి. ఈ కాలేజీలను ఏం చేయాలనే దానిపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
మే నాటికి గుర్తింపు ఇస్తాం: జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి
రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి మే నాటికి జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తనను కలిసిన విలేకరులతో చెప్పారు. కాలేజీల గుర్తింపుపై నిబంధనలను కచ్చితంగా పాటిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంకా ఏ కాలేజీకి గుర్తింపు ప్రకటించలేదని వివరించారు. పదోతరగతి విద్యార్థులు ఏ కాలేజీలోనూ ప్రవేశం పొందకూడదని సూచించారు. అనుబంధ గుర్తింపు ప్రకటించన తర్వాతే విద్యార్థులు ప్రవేశం పొందాలని కోరారు. ఏదైనా కాలేజీలో చేరినా ఆ ప్రవేశాలు చెల్లవని స్పష్టం చేశారు. గురువారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించామని, ఫైర్ ఎన్ఓసీపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.