Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల సమాచారం మేరకే 127 మందికి నోటీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో నివసిస్తున్న 127 మందికి నోటీసులు ఇవ్వడాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడారు) సమర్థించుకుంది. పోలీసుల సమాచారం మేరకే వారికి నోటీసులు ఇచ్చామని బుధవారం వివరణ ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారు ఫిబ్రవరి 20లోగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో బాలాపూర్లోని రాయల్ ఫంక్షన్హాల్కు విచారణకు రావాలని ఆదేశించింది. విచారణలో సరైన పత్రాలు సమర్పించకపోయినా, భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే.
పాతబస్తీ నవాబ్సాహెబ్ కుంటకు చెందిన సత్తార్ఖాన్కు నలుగురు అన్నదమ్ముళ్లు. వారంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు. అయితే, నవాబ్సాహేబ్ కుంటలో ఉన్న ఇల్లు సరిపోకపోవడంతో సత్తార్ఖాన్ భార్యాపిల్లలతో కలిసి బాలాపూర్లో నివాసముంటూ ఆటో నడుపుతున్నాడు. కాగా, సత్తార్ఖాన్ నకిలీ ధవపత్రాలతో ఆధార్ కార్డు పొందినట్టు ఆరోపిస్తూ ఉడారు (యూఐడీఏఐ) ఫిబ్రవరి 3న నోటీసులు పంపింది. భారత పౌరసత్వం కలిగివుంటే తగిన పత్రాలను చూపించాలని నోటీసులో పేర్కొంది. సరైన పత్రాలు చూపకపోయినా, గురువారంలోగా విచారణ అధికారి ముందు హాజరు కాకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించింది. 'మీరు ఒకవేళ భారతీయులు కాకపోతే, దేశంలోకి చట్టబద్ధంగానే ప్రవేశించామని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో సుమోటోగా తీసుకుని ఆధార్ను రద్దు చేస్తాం' అని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న సత్తార్ఖాన్ తీవ్ర ఆందోళనకు గురై.. తాను భారతీయుడని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. తల్లిదండ్రుల పత్రాలు, తాత, నానమ్మ ఎక్కడ పుట్టారో వారి పత్రాలు సమకూర్చుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చేసేదిలేక మంగళవారం సోషల్ మీడియాలో పెట్టడంతో పౌరసత్వ నోటీసుల విషయం బహిర్గతమైంది.
ఇదిలా ఉండగా, పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు యూఐడీఏఐకు లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో, బుధవారం ఉడారు అధికారులు స్పందించారు. కొంతమంది అక్రమ వలసదారులు తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులు పొందారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే 127 మంది హైదరాబాదీలకు నోటీసులు పంపించామని వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులకు ఆధార్ కార్డు మంజూరు చేయరాదని సుప్రీంకోర్టు చెబుతోందన్నారు. ఆధార్ చట్టం ప్రకారం కార్డుకు దరఖాస్తు చేయడానికి ముందు భారత్లో 182 రోజులపాటు నివసించాలన్న నిబంధన ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే, నోటీసులు అందుకున్న వారు ఒరిజినల్ ధవపత్రాలు సమకూర్చుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో విచారణను మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.