Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్:
రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ల ఖాళీలను భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలనీ, ఇకనైనా అధికారులు సాగతీయకుండా నియామకాల ప్రక్రియను ముగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీసీ భవన్లో బుధవారం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో వీసీలు లేకపోవడం వల్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైందన్నారు. ఇన్ఛార్జి వీసీలతో వర్సిటీల ప్రమాణాలు దెబ్బతిన్నాయనీ, నిధుల కేటాయింపులు లేకపోవడం, స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల వర్సిటీలు సంక్షోభంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు, ప్రతిభ, మెరిట్ కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ నియామకాల్లో వీరికి అన్యాయం జరుగుతున్నదనీ, విదేశీ యూనివర్సిటీలు గుర్తించినా, స్థానికంగా కులమే వారికి అడ్డంకిగా మారిందన్నారు. ఈసారైనా పది యూనివర్సిటీలకు గాను.. తొమ్మిదింటికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించి సామాజిక న్యాయం పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు వెంకట్ బంజారా, కుల్కచర్ల శ్రీనివాస్, శ్రీరాం మాదిగ, కనకాల శ్యాంనంద్, ఈడిగ శ్రీనివాస్గౌడ్, పానుగంటి విజరు, శంకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.