Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందులు, అవసరమైన సిబ్బందిని నియమించాలి
- సీఎం, ఆరోగ్య మంత్రికి జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఆయన శనివారం లేఖ రాశారు. ఈఎస్ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో మందులు, అవసరమైన సిబ్బందిని కేటాయించాలనీ, కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో అవినీతి, అక్రమాలు బయటపడిన తర్వాత ఈ మూడు, నాలుగు నెలల్లో రాష్ట్రంలో ఉన్న 70 డిస్పెన్సరీలు, నాలుగు ఆస్పత్రుల్లో కార్డుదారులకు అవసరమైన వైద్యం, మందులు ఇవ్వడం లేదని తెలిపారు. రోజూ వేలాది మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అదే విధంగా డిప్యూటేషన్లపైన పనిచేస్తున్న సిబ్బందిని వారి సొంత పోస్టుల్లోని స్థానాలకు పంపుతున్నారని వివరించారు. దీనివల్ల సిబ్బంది కొరత తీవ్రంగా ఏర్పడి, చూసే నాధుడే లేని పరిస్థితి ఏర్పడ్డదని తెలిపారు. కార్మికుల కాంట్రిబ్యూషన్తో నడుస్తున్న ఆస్పత్రులు ఈ దుస్థితిలో ఉండడం వల్ల జబ్బుపడిన కార్మికులు ఈఎస్ఐ కార్డులున్నా వైద్యం పొందే అవకాశం లేక ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక నానా ఇబ్బందులకు గురౌతున్నారని పేర్కొన్నారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈఎస్ఐ ఆస్పత్రులకు కావాల్సిన మందులు, సిబ్బందిని అందించి కార్మికులకు వైద్యం అందించడానికి తగు చర్యలు చేపట్టాలని కోరారు.