Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల
ప్రధాని మోడీ అవలంబిస్తున్న విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా పయనిస్తోందని, ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసన చేపడతామని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభలు నిర్వహిం చారు. తొలుత రాజా రాష్ట్ర నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపావిష్కరణ చేశారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం నుంచి పొంచి ఉన్న ముప్పును ముందుగానే గుర్తించి పోరాడాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రజలను కుల, మతపరంగా విభజించి పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సామాజికంగాను విభజిస్తోందన్నారు. సీఏఏతో ఎవరికీ నష్టం లేకుంటే ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులు, ఆదివాసులు, పేదలు, వలస కార్మికులు వారసత్వ ఆధారాలు ఎలా చూపిస్తారని అన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బాబ్రీ మసీదు, రామ మందిరం విషయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా కార్యాచరణ చేపడుతు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా ఓటేసినా రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నాయకులు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు గుండా మల్లేష్, జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్, 33 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.