Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెస్సు వసూలు చేయాలి..10 వేల పెన్షన్ ఇవ్వాలి
- నూతన వెల్ఫేర్ బోర్డును ప్రకటించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో నిర్మాణాలపై భవన నిర్మాణ సెస్సు వసూలు చేయకపోవడాన్ని నిరసిస్తూ, నూతన వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం నాడు చేపట్టే చలో లేబర్ కమిషనరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికులకు తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటం రాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా సెస్సు వసూలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నూతన వెల్ఫేర్ బోర్డు కమిటీని నియమించాలని, వెల్ఫేర్ బోర్డులోని నిధులతో కార్మికుల సంక్షేమం కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. 60 ఏండ్లు పైబడిన కార్మికులకు ప్రతి నెలా రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలనీ, కార్మికుల పిల్లల చదువుల కోసం స్కాలర్షిప్లు, అన్ని అడ్డాల్లో షెడ్లు, తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించాలని కోరారు. అడ్డా కేంద్రాల్లో ఐదు రూపాయల భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడేండ్ల నుంచి కార్మిక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు, బిల్డర్లతో కుమ్మకై అందినకాడికి దండుకుంటున్నారనీ, వెల్ఫేర్బోర్డుకు నిధులు జమకాకుండా చేస్తున్నారని విమర్శించారు.