Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో లక్ష ఇండ్లు అని 108 కట్టించిండు
- రెండు గదుల ఇండ్లకు అర్హులు 30 లక్షల మంది
- అవగాహనలేని వ్యక్తిని బీజేపీ మంత్రిని చేసింది
- మోడీ పుట్టకముందే హైదరాబాద్లో రైల్వేస్టేషన్లు : మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తున్నాయి కాబట్టే పట్టణ ప్రగతి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సీఎం కేసీఆర్ ముందుకొస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో గల తన కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో లక్ష, హైదరాబాద్ నగరంలో మరో లక్ష ఇండ్లు కట్టిస్తానని చెప్పిన కేసీఆర్...ప్రభుత్వ లెక్కల ప్రకారం కట్టించింది 108 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లేనని లెక్కలతో సహా చూపించారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు లేని వారు 30 లక్షల మంది అని తేలిందన్నారు. ఏడాదిలోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఇండ్లు కట్టివ్వకపోతే ఓట్లు అడగనని చెప్పిన కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లారని ప్రశ్నించారు. పట్నం గోస పేరుతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నదన్నారు. ఎర్రవల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడాన్ని, చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం లేదన్నారు. అయితే, ఆయన ఎర్రవల్లికి సర్పంచ్నా? చింతమడకకు ఎంపీటీసీనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మాట నమ్మినందుకు పేద ప్రజలపై ఐదేండ్లలో ఒక్కో కుటుంబంపై రూ.3 లక్షల భారం పడిందన్నారు. లక్షా 50 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 9 వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బకాయిలు చెల్లించలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గోరటి వెంకన్న పాడిన 'గల్లీ చిన్నది...' పాట నిజం అవుతున్నదన్నారు. రాష్ట్రంలో రాజీవ్ స్వగృహ ఇండ్ల నిర్మాణాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కమీషన్ల కోసం టీఆర్ఎస్ నేతలు కక్కుర్తి పడుతున్నా రనీ, అందుకే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చే నిధులను డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు టీఆఎస్ ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొంటే కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిని బట్టే టీఆర్ఎస్-బీజేపీ ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవు తున్నదన్నారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పక్కదారి పడుతున్న విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. మోడీ పుట్టకముందే తెలంగాణలో హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడకముందు తెలంగాణ ప్రజలు రైలును చూడలేదన్నట్టుగా కిషన్రెడ్డి మాట్లాడటం సరిగాదన్నారు. రాష్ట్రం పట్ల అసలు అవ గాహన లేని కిషన్రెడ్డికి బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఎలా కట్టబెట్టిందని ప్రశ్నించారు.