Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 27ని రద్దు చేయాలి
- కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరిగాదనీ, వెంటనే జీవో నెంబర్ 27ని రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శులు ఎం.సాయిబాబు, వీఎస్.బోస్, ఆర్డీ చంద్రశేఖర్, జి.ఉదయభాస్కర్, కె.సూర్యం, ఎంకే బోస్, ఎం.శ్రీనివాస్, తదితరులు సీఎం కేసీఆర్కు ఈ మెయిల్ ద్వారా లేఖను మంగళవారం పంపారు. కరోనా వైరస్ కట్టడికి వైద్యారోగ్య, పారిశుధ్య, పోలీసు, రెవెన్యూ, తదితర శాఖల ఉద్యోగులు తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా శ్రమిస్తున్నారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ, ప్రయివేటు అన్నిరకాల యాజమాన్యాలు ఉద్యోగులు, కార్మికులందరికీ జీతాలు చెల్లించాలనీ, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పిన మీరే ఇలా చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వమే జీతాల్లో కోత విధిస్తే ప్రయివేటు యజమానులు, కాంట్రాక్టర్లకు అలుసు ఇచ్చినట్టు అవుతుందని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి రూ.5,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన మీరు ఇలా చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు.
కోతలు కాదు...నెల వేతనం అదనంగా ఇవ్వాలి
లాక్డౌన్లో అహ్నరిషలు కష్టపడి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఆయా రంగాల్లోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల వేతనాల్లో 10 శాతం కోత పెట్టడం సరిగాదనీ, వారికి ఒక నెల వేతనం అదనంగా ఇవ్వాలని పారిశుధ్య, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమర్ అలీ, పాలడుగు భాస్కర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.వెంకటేశ్, జె.కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్కు ఈమెయిల్ ద్వారా లేఖలను వేర్వేరుగా మంగళవారం పంపారు.