Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆర్సీలు సరెండర్ చేస్తామన్న పట్టించుకోరారు..!
-త్రైమాసిక పన్ను రద్దు చేయాలని ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
-నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తున్న ఆర్టీఏ అధికారులు
-ఐదు లక్షల కుటుంబాలపై లాక్డౌన్ ప్రభావం!
-ప్రయివేటు వాహన యజమానుల గోస
నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనాతో దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడడగా రవాణా రంగాన్ని సైతం కుదుపునకు గురిచేసింది. ఎన్నో కష్టనష్టాలతో సాగుతున్న ట్రాన్స్పోర్టు రంగం లాక్డౌన్ మూలంగా కుదేలయ్యే దుస్థితికి చేరుకుంది. దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది వాహన యజమానులు, డ్రైవర్ల కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరరంగా తయారైంది. కర్ఫ్యూ దగ్గర నుంచి నేటి వరకు ట్రాన్స్పోర్టు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఆదాయం లేక ప్రతైమాసిక పన్ను కట్టలేమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం అన్ని రంగాలతో పాటుగా రవాణా రంగాన్ని కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ట్రావెల్స్ వాహనాలు ఆధారపడి సుమారు 5లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ వాహనాలు బయటకు వెళ్తేనే ఆ కుటుంబాలకు తిండి. కానీ ఆ పరిస్థితి లేదు. దీంతో ఆదాయం లేక డ్రైవర్లకు జీతాలివ్వలేని గడ్డు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం 5లక్షలకు పైగా కాంట్రాక్టు క్యారేజీ(సీసీ) బస్సులు, మాక్సీ క్యాబ్స్(12+1), మ్యాక్సీ క్యాబ్స్(7+1) ఆగిపోయాయి. వీటితో పాటు లారీలు, ట్రక్కులు, క్యాబ్లు, ఆటోలు నిలిచాయి. సాధారణ రోజుల్లోనే అడపాదడపా వచ్చే కిరాయిలతో కిస్తీలు, ఈఎంఐలు, డ్రైవర్ల జీతాలు చెల్లించడం గగనంగా ఉంటుండగా, ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు క్యారేజీ, మ్యాక్సీ క్యాబ్స్లు, అన్ని రవాణా వాహనాలకు ప్రతి మూడు నెలలకొకసారి చెల్లించే త్రైమాసిక (క్వాటర్లీ టాక్స్) పన్ను మాఫీ చేయాలని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్తో పాటు లారీ, ట్రక్కు ఓనర్స్, ఆటో క్యాబ్స్ జాక్లు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇందుకోసం తమ వాహనాల ఆర్సీలు సరెండర్ చేసేందుకు రవాణాశాఖ అధికారుల చుట్టూ కొన్నిరోజులుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాహన యజమానులు వాపోతున్నారు.
పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు అక్కడి టూరిస్ట్ ఆపరేటర్లను ఆదుకునేందుకు ముందుకొచ్చాయని, ఈ రంగాన్ని నిలబట్టేందుకుగాను త్రైమాసిక పన్ను, వాహన ఫిట్నెస్ ఫీజుల విషయంలో తగిన నిర్ణయం తీసుకన్నాయని పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
త్రైమాసిక పన్ను మాఫీ చేయాలి
కాంట్రాక్టు క్యారేజీ(సీసీ) బస్సులు, క్యాబ్స్ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బండ్లు అద్దెకు తిగిరిగితేనే ఆదాయం వస్తుంది. ఆదాయం లేనప్పుడు పన్నులు ఎలా కడుతాం. డ్రైవర్లకూ జీతాలివ్వలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో త్రైమాసిక పన్ను మూడు నెలల వరకు మినహయింపు ఇవ్వాలి. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఈ పన్ను రద్దుకు చర్యలు తీసుకోవాలి. తమ వాహనాల ఆర్సీలు సరెండర్ చేసుకోవాలని రవాణాశాఖ అధికారులను కోరుతున్నాం. ఇప్పటికైనా వాహన యజమా నులు, వాటిపై ఆధారపడిన డ్రైవర్ల ఇబ్బందులను గుర్తించి తగిన విధంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కె.గోపాల్ రెడ్డి,
అధ్యక్షుడు, తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్
ప్రభుత్వమే ఆదుకోవాలి
లారీలు రోడ్డెక్కడం లేదు. ఆయిల్, గ్యాస్, పాల ట్యాంకర్లు, నిత్యావసరాలను సరఫరా చేసేవి మాత్రమే రోడ్లపై తిరుగు తున్నాయి. లారీ యజమానులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఈ క్లిష్టకాలంలో తమకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఎన్.భాస్కర్ రెడ్డి
తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు