Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఎంకు వామపక్ష పార్టీల లేఖ
- అఖిలపక్షం జరపాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం సరైంది కాదని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎం కోదండరామ్ (టీజేఎస్), ఎల్ రమణ (టీటీడీపీ), పోటు రంగారావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), తాండ్రకుమార్ (ఎంసీపీ ఐయూ), జానకి రాములు (ఆరెస్పీ), ప్రసాద్ (సీపీఐఎంఎల్), ఎం రాజేష్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), బి సురేందర్రెడ్డి (ఫార్వర్డ్బ్లాక్) సంయుక్తంగా మంగళవారం లేఖ రాశారు. జీతాల మీద ఆధారపడే ఉద్యోగులకు ఇది ఆశనిపాతంగా ఉందన్నారు. 21 రోజుల లాక్డౌన్కే ఆర్థిక వ్యవస్థ అంతా తలకిందులైందని చెప్పడం సమంజసం కాదని తెలిపారు. అవసరమైన నిధులను కేంద్రాన్ని ఒప్పించి రిజర్వు బ్యాంకు వద్ద ఓడీ తెస్తామని స్వయంగా ప్రకటించి దానికి భిన్నంగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. ఇది ఉద్యోగుల జీతా ల సమస్యగా చూడకుండా సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు.
ప్రభుత్వమే సగం జీతం ఇస్తే ఆ ప్రభావం ప్రయివేటు ఉద్యోగులు, కార్మికులపైనా పడుతుందని తెలిపారు. లాక్డౌన్ కాలంలో పూర్తి జీతాలివ్వాలని
గుర్తు చేశారు. ప్రభుత్వమే సగం తగ్గిస్తామంటే ప్రయివేటు సంస్థలు అదేబాటలో పయనించే ప్రమాదముందని తెలిపారు. ప్రాణాలొడ్డి అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సగం జీతం చెల్లిస్తే తీవ్ర నిరాశకు లోనై, అది వారందించే సేవలపై ప్రభావం చూపే ప్రమాదముందని పేర్కొన్నారు. ఎక్కువ శాతం ఉద్యోగుల నెలజీతంపై ఆధారపడ్డారని తెలిపారు. నిత్యావసర వస్తువులతోపాటు అందరికీ అప్పులు ఇతర అవసరాలుంటాయని వివరించారు. ఈ నిర్ణయం వల్ల చాలా మందికి ఒక్క రూపాయి రాని పరిస్థితి నెలకొందని తెలిపారు. మరికొందరికి మైనస్ అంటే వారే ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 27 ప్రకారం వైద్య, ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్, పోలీసు శాఖ వారికి సగం జీతాలే వస్తాయని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వారికి సగం జీతం ఇవ్వడం క్షంతవ్యం కాదన్నారు.
కొన్ని రాష్ట్రాల్లో ఈ విధులు నిర్వహిస్తున్న వారికి ఒక నెల జీతాన్ని అదనంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయలు ఉన్న కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు గ్రామాల్లో ఉన్న ధనిక వర్గానికిచ్చే రాయితీలను తగ్గించడం, అదనపు పన్ను వేయడం ద్వారా వనరులను సేకరించాలని సూచించారు. అంతే తప్ప నెలవారీ జీతాలపై ఆధారపడే ఉద్యోగుల పట్ల ఈ పద్ధతిలో వ్యవహరించడం విరమించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు.
ధనవంతుల రాయితీలను తగ్గించాలి : సీపీఐ(ఎం)
ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడాన్ని తక్షణం ఉపసంహరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు మంగళవారం లేఖ రాశారు. ధనవంతులకిచ్చే రాయితీలను తగ్గించాలనీ, అదనపు వనరులను సేకరించాలనీ సూచించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారానైనా అఖిలపక్ష సమావేశం జరిపి చర్చించాలని కోరారు.