Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ముఖ్యమత్రి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమలు కావడానికి ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో రైతులకు వెంటనే సూచనలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. సూచించిన పంటకు సంబంధించిన విత్తనాలను శుక్రవారం రాత్రిలోగా గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. వానాకాలంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని రైతులకు సూచించించారు. 'గత వర్షాకాలం వేసిన పంటలతో పోలిస్తే పెద్దగా మార్పులేమీ లేవు. ఈ సారి మక్కలు వద్దని మాత్రమే చెప్పాం. మక్కల స్థానంలో కందులు లేదా పత్తి వేయమని కోరాం. గత ఏడాది వర్షాకాలం లాగానే ఈసారి కూడా 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పాం. కాకపోతే మార్కెట్లో డిమాండ్ కలిగిన వరి వంగడాలను ప్రభుత్వం సూచించిన ప్రకారం వేయమన్నాం. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ సారి మరో 10 నుంచి15 లక్షలు పెంచమన్నాం. మిగతా పంటల విషయంలో ఎలాంటి మార్పులు సూచించలేదు.' కొద్దిపాటి మార్పులే కాబట్టి రైతులు కూడా సంపూర్ణంగా సహకరించడానికి ముందుకొస్తున్నారని వివరించారు. 'ఏ క్లస్టర్లో ఏ పంట వేయాలనే విషయంలో నిర్ణయం జరిగినందున వ్యవసాయశాఖ తయారు చేసిన ప్రణాళికను ఆయా జిల్లాలకు వెంటనే పంపాలన్నారు. 'గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో అధికారులు సమావేశమవ్వాలి. జిల్లా వ్యవసాయాధికారులు మండల వ్యవసాయాధికారులకు క్లస్టర్ల వారీగా రూపొందించిన ప్రణాళిక ఇవ్వాలి. ఆ మరుసటి రోజు మండలాల్లో వ్యవసాయ విస్తరణాధికారుల సమావేశం నిర్వహించాలి. క్లస్టర్ల వారీగా ఏ పంట ఎంత వేయాలో వివరించాలి' అని ఆయన అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్థన్ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రవీణ్ రావు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి కేశవులు తదితరులు పాల్గొన్నారు.