Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట భూములకు సంబంధించి గతంలో వేసిన కేసులు, వ్యాజ్యాలు, కోర్టు తీర్పులపై పలువురు పిటిషనర్లు వాస్తవాలను దాచి పెట్టారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణం రీత్యా వారికి రూ.లక్ష జరిమానా విధించింది. ఆయా భూములపై ప్రయివేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులూ ఉండబోవని స్పష్టం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఆ భూములన్నీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కే చెందుతాయని పేర్కొంటూ ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి తీర్పు చెప్పారు. దీంతో గత పదిహేనేండ్లకుపైగా కోర్టుల్లో అవి తమ భూములేనంటూ న్యాయపోరాటం చేసిన ప్రయివేటు వ్యక్తులు ఓటమి చెందారు. సర్వే నెం 240, 239లోని 45.33 ఎకరాల భూమిపై తమకు హక్కులు ఉన్నాయనీ, హెచ్ఎండీఏ వాటిని వేలం వేయడానికి వీల్లేదని పేర్కొంటూ ఏబీ మిస్ట్త్రీతోపాటు మరో ఐదుగురు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.