Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల మేలు కోసమే నూతన వ్యవసాయ విధానం రూపొందించామని వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో సమగ్ర వ్యవసాయ విధానం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేలలను వర్గీకరణ చేసి ఆయా నేలల్లో పండే అనుకూలమైన పంటలను గుర్తించడంతో పాటు ప్రతి పంటనూ రికార్డ్ చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో పంటల విస్తీర్ణంపై కచ్చితమైన అంచనాలు రూపొందించి రాబోయే రోజుల్లో ప్రజలకు కూరగాయల కొరత లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలను సమర్పించాలని అదేశించారు. వ్యవసాయశాఖ అదనపు డైరెక్టర్ను ముఖ్య గణాంకాల అధికారిగా (పంటల నమోదు) నియమిస్తూ ఈ సందర్భంగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్దన్రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకులు వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.