Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోదావరిఖని
రామగుండం రీజియన్ సింగరేణి ఓపెన్కాస్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.40 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, వారి పిల్లల ఉచిత విద్యకు ఒప్పుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఒకరికి రూ.20 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపింది. చర్చల్లో గుర్తింపు కార్మిక సంఘం, సీఐటీయూ, సీపీఐ(ఎం), ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఐఎఫ్టీయూ నాయకులు పాల్గొన్నారు. మొదట చర్చలు విఫలం కావడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఏరియాస్పత్రి వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్మికులు పెద్దఎత్తున తరలిరావడం, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాక తీసుకునేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించరించడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తేలేదాకా మృతదేహాలు తీసుకోబోమని చెప్పడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం నుంచే బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనీ, కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేననీ ఒప్పంద కార్మికులు విధులు బహిష్కరించారు. అనంతరం ఏరియా ఆస్పత్రికి తరలివచ్చి ఆందోళనకు దిగారు. కార్మిక జేఏసీ నాయకులతో యాజమాన్యం చర్చలు ప్రారంభించగా కేవలం 28 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించింది. అందుకు ఒప్పుకోని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దనే బైటాయించారు. వారికి కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అప్పటిదాకా మృతదేహాలు మార్చురీలో ఉండిపోయాయి. ఈ క్రమంలో పలువురు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్మిక సంఘాల నాయకులతో వాగ్వాదానికి దిగారు. చర్చల పేరుతో కార్మిక సంఘాలు కాలయాపన చేస్తూ బాధిత కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువురిని సముదాయించారు. సాయంత్రం 5:30 గంటలకు చర్చలు కొలిక్కి వచ్చాయి. కార్మిక సంఘాల జేఏసీ రూ.60 లక్షలు డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.35 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. దీన్ని కార్మిక సంఘాలు, ఎమ్మెల్యే వ్యతిరేకించారు. బయటికొచ్చిన డైరెక్టర్(పా) ఉన్నతాధికారులతో మరోసారి చర్చించగా చివరకు రూ.40 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. అయితే బాధిత కుటుంబాలు రూ.50 లక్షల నష్టపరిహారం, ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. పర్మినెంట్ ఉద్యోగం నిబంధనలు లేవనీ, కాంట్రాక్టు ఉద్యోగం, రూ.40లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని డైరెక్టర్(పా) చెప్పారు. సింగరేణి పాఠశాలలో పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పడంతో కార్మిక సంఘాలు సైతం అంగీకరించాయి. బాధిత కుటుంబాలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ, కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని డైరెక్టర్(పా)కు సూచించారు. కార్మికుల పిల్లలకు వైద్యం, విద్య అందించేందుకు యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలని కోరారు.
మణుగూరులో సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి, మణుగూరు మండలాల్లో కోయగూడెం ఓపెన్ కాస్ట్, ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు. óఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (సీఐటీయూ అనుబంధ) రాష్ట్ర కార్యదర్శి బండి రాజేష్ మాట్లాడుతూ... సింగరేణిలో ప్రమాదాలకు, కాంట్రాక్ట్ కార్మికుల మరణాలకు యజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.