Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సిరసిల్లలో కార్మికుల నిరసన
నవతెలంగాణ - సిరిసిల్ల
పవర్లూం కార్మికులకు కలెక్టర్ ఇచ్చిన హామీ వెంటనే అమలు చేసి, యారన్ సబ్సిడీ డబ్బులను చెల్లించాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముశం రమేష్ డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరల యారన్ సబ్సిడీని కార్మికులకు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం ఒక రోజు పవర్ లూమ్స్ బంద్ చేపట్టారు. కార్మికులందరూ సీఐటీయూ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులకు గతేడాది కూలి పెంపుదల కోసం చేసిన సమ్మెలో యారన్ సబ్సిడీ అందిస్తామనీ, నెల రోజుల్లోనే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామనీ కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు రూ.18కోట్లను ఏడాది కిందటే విడుదల చేసినా కార్మికుల ఖాతాల్లో మాత్రం వేయలేదన్నారు. విషయాన్ని అనేకసార్లు కలెక్టర్, చేనేత జౌళిశాఖ అధికారులకు విన్నవించినా స్పందించలేదన్నారు. ఆరువేల మంది పవర్లూమ్ కార్మికుల సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వంటి కష్టకాలంలో బతుకమ్మ చీరల సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందితే ఇబ్బందులు కొంతమేర తొలగిపోయే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, నాయకులు నక్క దేవదాస్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్, పవర్లూమ్ కార్మికులు పాల్గొన్నారు.