Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫీజులు కట్టనిదే మృతదేహాలు ఇవ్వని దౌర్భాగ్యం
- అందినకాడికి దోచుకుంటున్న వైనం
-కార్పొరేట్ ఆస్పత్రులపై సర్కారు అజమాయిషీ శూన్యం
- ప్రభుత్వాస్పత్రుల బలోపేతమే మేలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్ ఆస్పత్రుల ధనదాహం కొనసాగుతూనే ఉన్నది. కరోనా కష్టకాలంలో లాభాలు ఆశించకుండా వైద్యం అందించాలనే సోయి మరిచి దోపిడీకి తెరలేపాయి, వ్యాధి ఉన్నప్పుడే లాభాల కుప్పను పోగేసుకోవాలనుకున్నాయో ఏమోగానీ..చిన్నచిన్న సమస్యలతో వచ్చేవాళ్లను కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. మామూలు రోజుల్లో కంటే రెండు, మూడు రెట్ల మేర ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తూ... డబ్బులు కట్టనిదే అత్యవసరవైద్యం అందించబోమని తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నాయి. వైద్యంపై సర్కారు నిఘా లేకపోవడంతో తాము ఆడిందే ఆట పాడిందే పాట అన్న విషయాన్ని ఇటీవలి ఘటనలు రుజువుచేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ, తదితర పథకాల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు డబ్బులు వెచ్చించే బదులు...అదే బడ్జెట్ను ప్రభుత్వ ఆస్పత్రులకు కేటాయించి...నియామకాలను చేపడితే అద్భుతమైన వైద్యాన్ని అందించవచ్చని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వాస్పత్రుల ఆవశ్యకత సమాజానికి అర్థమవుతున్నది. ఫలితంగానే ' వామ్మో ప్రయివేటు వైద్యం మాకొద్దు..సర్కారు దవాఖానాలే ముద్దు' అనే డిమాండ్ ముందుకొస్తున్నది.
ప్రయివేటు ఆస్పత్రులు, చిన్నాచితక క్లినిక్లలో కలిపి రాష్ట్రంలో పదివేల దాకా ఉన్నాయి. కార్పొరేట్వి వంద కుపైగా ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష వరకు బెడ్లు ఉంటాయని అంచనా. ఈ ఆస్పత్రుల్లో చాలా వరకు నిబం ధనలకు విరుద్ధంగా ఇరుకైన బిల్డింగ్లలో నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్నిటికైతే పార్కింగ్ స్థలాలు కూడా లేవు. హైదరాబాద్లో 400 బెడ్లు ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో కనీసం 20 వెంటిలేటర్లు కూడా లేని పరిస్థితి. జ్వరం వచ్చిందనే భయంతో ఆ ఆస్పత్రికి వెళ్తే వేలకువేలు ధారబోయాల్సిందే. అవసరం ఉన్నా, లేకున్నా ఫీజులు, బిల్లులు రాబట్టుకునేందుకు టెస్టులు చేస్తారనే అపవాదూ ఆ ఆస్పత్రులపై ఉంది. ప్రయివేటు ఆస్పత్రులు కదా ఇవన్నీ కాబోలు అనుకుందాం. తాజా పరిస్థితుల్లోనూ కనీస వైద్య సేవలు అందించాలనే సామాజిక స్పృహా ఆ యాజమాన్యాలకు లేకపోవడం దారుణం. మొన్నటికి మొన్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి శ్రీకాంత్ భార్య మృతిలోనూ ముమ్మాటికీ కార్పొరేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం, ధనదాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల ఫీజు కడితేగానీ వైద్యమందించబోమని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తెగేసి చెప్పాయి. ఎనిమిది ఆస్పత్రులు తిరిగినా కరోనా సాకుతో వైద్యం నిరాకరించడం, కొన్ని ఆస్పత్రులు రోజుకు లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయలు తెలిస్తేనే మెలికపెట్టడం వల్లనే ఆమె చనిపోయింది. కరోనా వారియర్ డాక్టర్ సుల్తానాకు మరో ఆస్పత్రిలో ఒక్కరోజుకు రూ.1.15 లక్షల బిల్లు వేశారు. ప్రశ్నిస్తే నిర్బంధించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకుంటే గానీ సమస్య తెగలేదు. దీనిని బట్టే ప్రయివేటు ఆస్పత్రుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కట్టడిలో సేవలందిస్తున్న ఓ డాక్టర్ అని చూడకుండా ఆ కార్పొరేట్ ఆస్పత్రి వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఓ వ్యక్తి బైక్ మీద నుంచి కింద పడ్డాడు. చేయి మెలితిరిగింది. మామూలుగానైతే నాలుగైదు వేలు అయితే వైద్యం అయిపోయేదే. కరోనా సాకు చూపెట్టి పీపీఈ కిట్టు, వైద్యసేవలకు అదనంగా డబ్బులు తీసుకుంటున్నామని చెప్పిమరీ రూ.20 వేలు వసూలు చేశారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అయితే బిల్లులు కట్టనిదే మృతదేహాలు ఇవ్వబోమంటూ తెగేసి చెబుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ ఆస్పత్రి యాజమాన్యాం ఐదు లక్షల రూపాయలు కడితేగానీ మృతదేహం ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా ఆ కార్పొరేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. కార్పొరేట్ ఆస్పత్రులపై చూసీచూడనట్టు వదిలేస్తున్న సర్కారుకు అదే పెద్ద బదనాం తెచ్చిపెడుతున్నది. ఆరోగ్యశ్రీ, తదితర పథకాల కింద కార్పొరేట్ ఆస్పత్రులకు ఏటా వందల కోట్ల రూపాయలను ఇచ్చే బదులు ఆ డబ్బులతోనే ప్రభుత్వ ఆస్పత్రులను బాగు చేయించి వైద్యారోగ్య శాఖలోని ఖాళీలను భర్తీచేస్తే పేదలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది. అదే సమయంలో జాతీయ విపత్తుల సమయంలో అత్యవసర వైద్యం అందించబోమని చెప్పే ఆస్పత్రుల అనుమతులను రద్దుచేయాలనీ, రోగులు వద్ద డబ్బులు లేకున్నా ఎమర్జెన్సీ వైద్య సేవలను నిరాకరించరాదనే ఓ చట్టాన్ని తేవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నది.
వైద్యాన్ని ప్రభుత్వ పరం చేయాలి
- జగన్, ప్రయివేటు ఆస్పత్రుల బాధితుల సంఘం
వైద్యరంగాన్ని ప్రభుత్వ పరం చేయాలి. వైద్యారోగ్య శాఖ అడ్మినిస్ట్రేషన్ను మెరుగుపర్చాలి. ప్రభుత్వా స్పత్రుల్లో ఒక్కో డాక్టర్ 10 నుంచి 25 మంది దాకా కరోనా రోగులను పరీక్షించాల్సి వస్తున్నది. జిల్లాల నుంచి డాక్టర్లను డిప్యూటేషన్పై తీసుకొచ్చి కరోనా సేవలకు వాడుకుంటున్నారు. దీంతో వారిపై తీవ్ర భారం పడుతున్నది. ప్రయివేటు ఆస్పత్రులేమో లక్షలకు లక్షల రూపాయలు ధారబోస్తేగానీ వైద్యసేవలు అందించబోమని అల్టీమేటమ్ ఇస్తున్నాయి. . ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులు పటిష్టంగా ఉంటే నేడు ఈ పరిస్థితే వచ్చి ఉండేది కాదు. అందుకే ప్రభు త్వాస్పత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. డాక్టర్, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి. జిల్లాల్లోనూ కరోనా రోగులకు వైద్య చికిత్స అందించాలి.
కింగ్కోఠి డాక్టర్ల సేవలతోనే బతికా
నేను ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్లో చిన్న ఉద్యోగిని. మా కొడుకు ఆటో డ్రైవర్. పదిరోజుల కింద రాత్రి పూట శ్వాస ఆడటం కష్టమైంది. మా కొడుక్కి చెబితే వెంటనే పక్కనే ఉన్న ప్రయివేటు ఆస్పత్రికి తీసుకుపోయిండు. ఆడ 4 వేల నుంచి 4,500 రూపాయలు అయ్యే సిటీ స్కాన్కు రూ.7500 తీసుకున్నరు. ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పేశారు. గీ చీకట్ల ఏడ్కి పోవాలని మావోడు అడిగితే గాంధీకి పొమ్మన్నరు. గాంధీల డైరెక్ట్గా తీసుకుంటలేరని మాకు తెల్వదు. ఆడ్కిపోవంగనే ఉస్మానియాకు పోయి టెస్టు చేయించుకుని రమ్మన్నరు. ఆడ టెస్టు చేస్తే కరోనా అని తేలింది. కింగ్కోఠి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస ఆడక చస్తనేమో అనుకున్న. ఆడి డాక్టర్లు ఆక్సిజన్ పెట్టి బతికించిండ్రు. వారి సేవలు మరువలేనివి. కొంచెం కోలుకోవంగనే ఈడ ఎమర్జెన్సీ వాళ్లకు తక్కువ బెడ్లు తక్కువ ఉన్నయని నన్ను ఆయుర్వేదిక్ ఆస్పత్రికి తరలించారు. కరోనా నుంచి కోలుకున్న. ఇంటి దగ్గర ఉంది కదా అని పోతే పట్టించుకోని ఆస్పత్రులు ఉంటే ఎంత లేకుంటే ఎంత. ముందు సర్కారు దవాఖానాలను బాగు చేస్తే ప్రయివేటోల్లు చెప్పినట్టు ఇంటరు.