Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జనాలు పల్లెలకు
- వైరస్ సోకుతుందనే ఆందోళనలో స్థానికులు
- పలు గ్రామాల్లో సెల్ఫ్ లాక్డౌన్ రాకుండా అడ్డుకునే యత్నం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రోజురోజుకీ కేసులు పెరుగుతుండటం, మరోవైపు లాక్డౌన్ విధిస్తారనే ప్రచారంతో తట్టాబుట్టా సర్దుకుని పట్నం నుంచి ప్రజలు ఊరిబాట పడుతున్నారు. ఇప్పటిదాకా తమ వరకు కరోనా రాలేదన్న ధీమాతో తమ పనులు చేసుకుంటూ వెళ్లిన ఊర్లల్లోని ప్రజలు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తున్న వారితో ఆందోళనకు గురవుతున్నారు. పట్నం నుంచి వచ్చినోళ్లకు ఎక్కడ కరోనా ఉందో అన్న భయంతో వణికిపోతున్నారు. కొన్ని గ్రామాల్లోనైతే స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టుకున్నారు. మరికొన్ని గ్రామాల్లో పట్నం నుంచి వచ్చినోళ్లను పాఠశాల భవనంలోనో, బావుల వద్దనో ఉంచుతున్నారు. అలా వీలుకాని పక్షంలో హౌం క్వారంటైన్ చేస్తున్నారు. 14 రోజుల నిబంధనను నిక్కచ్చిగా పాటిస్తున్నారు. అయినా, ఏదో ఒక రూపంలో పాజిటివ్ కేసులు వస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్లో తన పంజాను విసురుతున్నది. గ్రేటర్లోనే ఎక్కువ కేసులు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు రెండు వారాల నుంచి హైదరాబాద్లోనే 85 శాతానికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి తోడు జులై చివరి వారంకల్లా 60 వేలకు పైగా కేసులు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇండ్లు ఖాళీ చేసి కొందరు, కరోనా తగ్గిన తర్వాత వద్దామని మరికొందరు సొంతూర్లకు తరలిపోతున్నారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వరుసబెట్టి వస్తుండటంతో ఎక్కడ కరోనా వ్యాప్తి చెందుతుందో నన్న ఆందోళన గ్రామాల్లో నెలకొంది. నగరం నుంచి గతంలో వస్తే అప్యాయంగా పలుకరించేవారు, తాజా కరోనా విస్తరణ పరిస్థితుల్లో కనీసం వారి వైపు కూడా కన్నెత్తి చూడట్లేదు. పైగా, అక్కడి నుంచి వచ్చినవారికి సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారు. వారిని పాఠశాలలు, బావుల వద్దనో క్వారంటైన్ చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఇల్లు ఖాళీ చేసి యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలోని తన సొంత గ్రామానికి కుటుంబంతో సహా వెళ్లాడు. దీంతో ఆ గ్రామస్తులంతా ఆ కుటుంబాన్ని హౌం క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు కావాల్సిన సరుకులన్నీ పంచాయతీ నుంచి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం జంగంపల్లికి ఓ వ్యక్తి తన తల్లిని తీసుకుని ఊరికి వచ్చాడు. కానీ, గ్రామస్తులు వారిని ఊర్లోకి రానివ్వలేదు. దీంతో వారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనాతో మృతి చెందింది. ఆమెను సొంతూరుకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయాలని కుటుంబ సభ్యులు భావించారు. కానీ, గ్రామస్తులు ఒప్పుకోకపోవడంతో హైదరాబాద్లోనే ఓ శ్మశాన వాటికలో అంత్యక్రియలను ముగించాల్సి వచ్చింది. ప్రతి గ్రామంలోనూ ఈతరహా పరిస్థితులే నెలకొన్నాయి.
సెల్ఫ్ లాక్డౌన్లు...
స్వీయ నిర్బంధాలు
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో కూరగాయలు అమ్మే మహిళకు కరోనా సోకింది. ఆమెతో కాంట్రాక్టులో ఉన్నవారినందరినీ హౌం క్వారంటైన్ చేశారు. అలాగే ఆ గ్రామంలో 15 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తూ గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకున్నది. ఊర్లో ఎవ్వరూ తిరగొద్దని కోరింది. ఎవరైనా ధిక్కరిస్తే జరిమానా కూడా విధిస్తామని హెచ్ఛరించింది. అయితే, కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకునేందుకు ఇంటికొకరికి మాత్రం ఆంక్షలతో అనుమతులిచ్చింది. కరోనా భయంతో గ్రామస్తులెవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాల్టీలోనూ లాక్డౌన్ విధించారు. నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి ఏఈఆర్సీ క్యాంపు గ్రామంలోనూ ఇలాగే సెల్ఫ్ లాక్డౌన్ పెట్టారు. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గ్రామంలోకి కొత్తవారినెవ్వరినీ రాన్వికూడదని స్తానిక గ్రామపంచాయతీ తీర్మానం చేసింది. నల్లగొండ జిల్లాలోని మరో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి కారులో తరలించారు. అక్కడ ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమెతో కాంటాక్టులో ఉన్నవారు, కారు డ్రైవరు తమ కుటుంబంలోని చిన్నపిల్లలకు, గ్రామస్తులకు ఎలాంటి హాని కలగొద్దనే ఉద్దేశంతో తమ బావుల వద్ద 14 రోజులు ఉన్నారు. ఏ గ్రామంలో చూసినా ఇలాగే కరోనా భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మొదట గ్రామాల్లో పెద్దగా మాస్కులు ధరించలేదు. కానీ, ఇటీవల హైదరాబాద్ నుంచి సొంతూర్లకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కచ్చితంగా మాస్కులు పెట్టుకుంటున్నారు. శానిటైజర్ బాటిళ్లను వెంటనే ఉంచుకుంటున్నారు. పొలం పనులు, చేనులో విత్తనాలు పెట్టేందుకు వెళ్లిన సమయంలో కూలీలు మధ్యాహ్న భోజనం అందరూ ఒక్కదగ్గరే కూర్చోని తినేవారు. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. భయంతో ఎవరికివారు దూరంగా కూర్చొని భోజనం చేసేస్తున్నారు.