Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
30 ఏండ్ల కిందట ప్రభుత్వం దళితులకిచ్చిన భూములు అటవీశాఖకు చెందినవంటూ సంబంధిత అధికారులు నోటీసులివ్వడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని అటవీశాఖ రేంజర్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
లక్కారంలోని సర్వేనెంబర్ 50లో 25 ఎకరాల అసైన్డ్ భూమిని సుమారు 20 కుటుంబాలకు 1991లో అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. అప్పట్నుంచి పూర్తి హక్కుతో ఆ రైతులు సాగు చేసుకుంటున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలుండటంతో రైతుబంధు, రైతు బీమా కూడా పొందారు. ఇటీవల అటవీశాఖ సర్వేలో ఈ భూములు తమ శాఖకు చెందినవిగా గుర్తించడంతో వాటిని ఖాళీ చేయాలంటూ రైతులకు నోటీసులు అందించారు. ఆ భూములే జీవనాధారం కావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నామని చెబుతూనే గత ప్రభుత్వాలిచ్చిన భూములను లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులు అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ భూములు తీసుకుంటే చావే శరణ్యమంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. ఆర్డీఓ సూరజ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని మళ్లీ సర్వే నిర్వహించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.