Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రభుత్వాస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో కరోనా రోగులకు వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో, జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అవసరాలు, సమస్యలపై ఆస్పత్రుల సూపరిండిండెంట్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, ఫీవర్ ఆస్పత్రి సూపరిండిండెంట్ డాక్టర్ శంకర్, గాంధీ ఆస్పత్రి సూపరిండిండెంట్ డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పూర్తి స్థాయిలో కరోనా చికిత్స అందించాలని సూచించారు. తక్కువ లక్షణాలున్న వారికి జిల్లాస్పత్రుల్లోనే చికిత్స చేయాలని ఆదేశించారు. పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేని వారిని హౌం ఐసోలేషన్లో ఉంచాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఏ కొరత ఉన్నా తన దృష్టికి తీసుకురావాలనీ, వైద్యం ఏది కోరితే అది ఒక్క రోజులో అందిస్తామని హామీనిచ్చారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు నర్సులు అన్నం తినిపిస్తున్నారనీ, అలాంటి మానవత్వం ఇప్పుడు అవసరమనీ, వారి సేవలు మరువలేనివని కొనియాడారు. మహబూబ్నగర్ సూపరిండిండెంట్ జిల్లా ఆస్పత్రి క్వార్టర్స్లోనే ఉండి అందరికీ అందుబాటులో ఉంటున్నందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అన్ని జిల్లాస్పత్రుల సూపరిండిండెంట్లు కూడా జిల్లా కేంద్రంలోనే ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.