Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ఓపెన్కాస్టుల్లో బడా కాంట్రాక్టర్లు మట్టి తీసే పనుల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనీ, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. ఈ కుంభకోణాలపై సింగరేణి విజిలెన్స్ విభాగం అసమర్థంగా వ్యవహరించిందనీ, డీనికి కారణం సింగరేణి సీఎండీ, ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నారు. గతేడాది కూడా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో భారీ డీజిల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందనీ, ఇల్లందు ఏరియా కోయగూడెంలో కూడా ఇదేరమైన డీజిల్ కుంభకోణం జరిగి నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని కోరారు. సింగరేణిలో ఓవర్ బర్డెన్ కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు, ఇతర సంక్షేమ, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయడం లేదని తెలిపారు. జేబీసీసీఐ స్థాయిలో జరిగిన ఒప్పందాల్లో సింగరేణి యాజమాన్యం భాగస్వామయ్యమై నప్పటికీ కోలిండియాలో అమలయ్యే వేతనాలు ఇక్కడ ఇవ్వడం లేదని వాపోయారు. దీనికి సింగరేణి ఉన్నతాధికారులకు భారీ గా అందుతున్న ముడుపులే కారణమని తెలిసిందని పేర్కొ న్నారు. వేతనాలు అమలు కాకపోవడం వల్ల ఏటా కార్మికులు రూ. 200 కోట్లను నష్టపోతున్నారని వివరించారు. హైపవర్ కమిటీ వేతనాల అమలు గురించి సీఎండీ దృష్టికి తీసుకెళ్లినా కనీస స్పందన రాకపోవడం దారుణమని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న డీజిల్, మట్టి తీసివేత, వేతనాల చెల్లింపులు, తదితర భారీ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణాల్లో సంస్థ చైర్మెన్తోపాటు అనేక మంది ఉన్నతాధికారుల పేర్లు వస్తున్నందున కేంద్ర విజిలెన్స్ కమిషన్, ఇతర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.