Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య, పారిశుద్ధ్యేతర ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలనీ, అన్ని మున్సిపాల్టీల్లో కచ్చితంగా రూ. 12000 వేతనం అమలు చేయాలనీ, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని ఆ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాలు జారీ చేయడం పట్ల తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖమర్అలీ, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లుగా క్రమం తప్పకుండా ప్రతి నెలా మొదటివారంలో వేతనాలు చెల్లించాలనీ, కొత్త మున్సిపాల్టీల్లోనూ జీవో 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలని కార్మికులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేనందున కొత్త మున్సిపాల్టీల్లో వేతనం రూ 12000 చెల్లించలేమని అధికారులు, పాలకవర్గాలు ఆలస్యం చేస్తూ వచ్చాయని తెలిపారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిపత్రాలు సమర్పించామన్నారు. వీటిపై మంత్రి స్పందిస్తూ ఈ నెల 10న సర్క్యూలర్ జారీ చేశారని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను కచ్చితంగా రాష్ట్రంలోని నూతన మున్సిపాల్టీలతో సహా అన్నింటిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.