Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో నిరసనలు
నవతెలంగాణ-కంఠేశ్వర్
గ్రామాభివృద్ధి కమిటీల (వీడీసీ) ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని, వాటిని నిషేధించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. నిజామాబాద్ కలెక్టరేట్తో పాటు, ఆర్మూర్, బోధన్, కోటగిరి, నవీపేట్ తదితర మండలాల్లో మంగళవారం నిరసనలు చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ధర్నాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేశ్బాబు మాట్లాడుతూ.. అనేక గ్రామాల్లో వీడీసీలు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన పాలకవర్గాలకు సమాంతరంగా పరిపాలనను కొనసాగించటానికి పెత్తందార్లు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా, సంక్షేమ పథకాలను అమలు జరిపే సందర్భంలో గ్రామాభివృద్ధి కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే వారి దౌర్జన్యాలు, దాష్టీకాలు, పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బడుగు బలహీన తరగతుల వారితోపాటు తమ మాట వినని వారిపైనా సామాజిక బహిష్కరణలు, జరిమానాలు, దాడులు చేస్తూ తమ పెత్తనాన్ని కొనసాగించడానికి వీడీసీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దాడులు చేసిన సందర్భాల్లో రెవెన్యూ అధికారులు, పోలీసులు సంధి కుదిర్చే ప్రయత్నం చేయడం మూలంగా వీరి ఆటలు కొనసాగుతున్నాయని తెలిపారు. వీడీసీ పెద్దలపై కఠినంగా వ్యవహరించకపోవడంతో దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. వెంటనే వీడీసీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గోవర్ధన్, ఎస్.లత, కృష్ణ, సుజాత, జిజాబాయి, అంబిక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.