Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఫెల్ నిర్వహణ భారమే..!
- ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లలో ఐఎఎఫ్
- సుఖోరు, మిరాజ్ల విడిపరికరాల కోసం తప్పని ఎదురుచూపులు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళ (ఐఎఎఫ్) బలాన్ని మరింత పెంచుతూ ఫ్రాన్స్ నుంచి ఇటీవలే ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలా ఏర్ స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయ్యాయి. ఇవి ఫ్రాన్స్లో బయలుదేరింది మొదలు భారత్ చేరేదాకా.. ఇది మోడీ సర్కారు ఘనతేనని దాని అనుకూల మీడియా కథనాల మీద కథనాలు వండి వార్చుతున్నది. అయితే ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడుతున్న ఐఎఎఫ్కు కొత్త విమానాల నిర్వహణ గుదిబండలా మారనుందని ఆ సంస్థకు చెందిన సీనియర్ అధికారులు ఆరోపిస్తున్నారు. అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఈ విమానాల నిర్వహణ అంత మాములు విషయం కాదని వారంటున్నారు.
భారత్లో రాఫెల్ ఏడో రకం యుద్ధ విమానం. ఇది మూడు, నాలుగో తరానికి చెందిన సుఖోరు (రష్యా), మిగ్-29, మిరాజ్ (ఫ్రాన్స్), స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తేజస్ కంటే అన్ని రకాలుగా ముందున్నది. అయితే వీటి మెయింటనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (ఎంఆర్వో) ఐఎఎఫ్కు ఒక పీడకల వంటిదేనని ఆ సంస్థలో త్రీస్టార్ రేటింగ్ ఉన్న ఒక సీనియర్ అధికారి అంటున్నారు. పై విమానాల నిర్వహణ ఖర్చు కొన్నేండ్లుగా సాధారణం కంటే 55 శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాజాగా రాఫెల్ రాకతో ఐఎఎఫ్కు మరిన్ని ఆర్థిక నష్టాలు తప్పవని తెలిపారు. గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), డిఫెన్స్ పార్లమెంటరీ కమిటీ నివేదికలు ఇదే విషయాన్ని ఎత్తిచూపాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఐఎఎఫ్కు రూ. 30 వేల కోట్ల బడ్జెట్ (రెవిన్యూ ఎక్స్పెండేచర్) ను కేటాయించారు. ఇందులో సుమారు రూ. 910 కోట్లు స్టోర్ల నిర్వహణ (ఎంఆర్వో ఈ విభాగంలోకే వస్తుంది) కు కేటాయించారు. అయితే ఇది గతేడాది బడ్జెట్ (దాదాపు రూ. 970 కోట్లు) కంటే రూ. 60 కోట్లు తక్కువే కావడం గమనార్హం. కాగా, ఐఎఎఫ్ను బలోపేతం చేయడానికి ఇప్పటికే మంజూరుచేసిన 42 యుద్ధ విమానాలను 28కి కుదించారు. నిధుల లేమి, నిర్వహణ లోపాల కారణంగానే వాటిని తగ్గించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రష్యా, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకుంటున్న సుఖోరు, మిగ్, మిరాజ్ యుద్ధ విమానాల విడి పరికారాలు (స్పేర్ పార్ట్స్) పరిమితస్థాయిలో ఉన్నాయని రక్షణ శాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై ఇటీవలే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్.. రష్యాకు వెళ్లి సుఖోరు, మిగ్-29 విమానాల ఇంజిన్ విడి భాగాల సమస్యలను అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి రష్యా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనే వచ్చినా.. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పేమీ లేదని అధికారులు తెలిపారు.