Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 31వరకూ అంతర్జాతీయ విమాన సేవలు రద్దు: డీజీసీఏ
- హౌం క్వారంటైన్లో నాగాలాండ్ ముఖ్యమంత్రి
- కరోనా కట్టడిలో కేంద్రం విఫలం: చిదంబరం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం పెరుగుతూనే ఉంది. నిత్యం దాదాపు 50 వేల మంది వైరస్ బారినపడుతుండటం దేశంలో వైరస్ వ్యాప్త్తికి అద్దం పడుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,078 పాజిటివ్ కేసులునమోదయ్యాయి. ఇదే సమయంలో 779 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 రోగుల మరణాల సంఖ్య 35,747కు పెరిగింది. కరోనా మహమ్మారి బారినపడినవారి సంఖ్య 16,38,870కు చేరింది. ప్రస్తుతం 5.45 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 10.57 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 64.54శాతం ఉండగా, మరణాల రేటు 2.18శాతంగా ఉంది.
ఇక ప్రపంచవ్యాప్తంగా అధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. కోవిడ్-19 మరణాల్లో ఐదో స్థానానికి చేరింది. అత్యధికంగా అమెరికాలో ఇప్పటివరకూ 46.35 లక్షల మందికి కరోనా సోకగా వారిలో 1.55 లక్షల మంది మరణించారు.రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 26 లక్షల పాజిటివ్ కేసులు, 91 వేల మరణాలు చోటుచేసుకున్నాయి.
ఈ నెలాఖరు వరకూ అంతర్జాతీయ విమాన సేవలు రద్దు : డీజీసీఏ
అంతర్జాతీయ విమానయాన రవాణా సేవలను ఆగస్టు 31వరకూ రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. ఇదివరకూ విధించిన (జులై 31) అంతర్జాతీయ విమనయాన సేవల రద్దు ఈ నెలాఖరు వరకూ కొనసాగుతుందని పేర్కొంది.
కోల్కతాలో 45 మంది పోలీసులకు కరోనా
రోజురోజుకూ పశ్చిమ బెంగాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కోల్కతాలో 45 మంది పోలీసులు వైరస్ బారినపడ్డారని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో కోల్కతాలో వైరస్ సోకిన పోలీసుల సంఖ్య 1,100 చేరింది. కాగా, రాష్ట్రంలో కరోనా సోకిన మొత్తం బాధితుల సంఖ్య 70 వేలకు చేరువైంది. ఇప్పటికే 1536 మంది మరణించారు.
యూపీలో 43 మంది కరోనా రోగులు మిస్సింగ్
ఉత్తరప్రదేశ్లో కరోనా ప్రభావం పెరుగుతున్న వేళ.. కరోనా పరీక్షల సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చి పాజిటివ్ వచ్చిన వారు కరోనా వ్యాప్తికి కారణమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా రాష్ట్రంలోని ఘాజీపూర్లో 43 మంది కరోనా రోగుల జాడ తెలియడం లేదని అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కెకె. వర్మ.. జిల్లా అదనపు మెజిస్ట్రేట్కు లేఖ రాశారు. ఈ 43 మందికి కరోనా పరీక్షలు చేసిన సమయంలో వారు ఫోన్ నంబర్లు, అడ్రెస్లు తప్పుగా ఇచ్చారని లేఖలో వివరించారు. వీరంతా ఆస్పత్రిలోనికానీ, హౌం ఐసోలేషన్లో కానీ లేరని ఆయన వెల్లడించారు. వీరి జాడ కనిపెట్టేందుకు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్టు లేఖలో వివరించారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకూ 85,261 కేసులు నమోదయ్యాయి. అలాగే, 1,630 మంది మరణించారు.
నీటితోనే కరోనా ఖతం !
కరోనావైరస్ను ''నీరు'' 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది కరోనా వైరస్ గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయనీ, 99.9% వైరస్ కణాలు 72 గంటల్లో చనిపోతాయని స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ వెక్టర్ అధ్యయనం తెలిపింది. మరిగే ఉష్ణోగ్రత వద్ద నీరు కరోనా వైరస్ని పూర్తిగా తక్షణమే చంపేస్తుందని రష్యన్ ఫెడరల్ సర్వీస్ ఫర్ హ్యూమన్ వెల్బింగ్ తాజాగా ప్రచురించిన పరిశోధనలో పేర్కొంది. వైరస్ కొన్ని పరిస్థితులలో నీటిలో జీవించగలదు, కానీ ఇది సముద్రంలో లేదా మంచినీటిలో గుణించదని అధ్యయనం తెలిపింది.
ఫలితాలిస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా
కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా మంచి ఫలితాలనిస్తున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. కోతుల్లో వైరస్ ప్రభావాన్ని తగ్గించటంతో పాటు ఊపిరితిత్తులు దెబ్బతినకుండా రక్షించడంలో ఈ వ్యాక్సిన్ దోహదపడుతున్నట్టు తెలిపారు. అయితే, కొవిడ్-19 బారిన పడకుండా ముందేం పూర్తిగా నివారించడం మాత్రం దానికి సాధ్యం కాదేమోనని అభిప్రాయపడ్డారు. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 'సీహెచ్ఏడీవోఎక్స్1 ఎన్కొవ్-19' అనే ప్రయోగాత్మక టీకాను అభివద్ధి చేశారు. కోతుల్లో దాని పనితీరును అమెరికాలోని జాతీయ అలర్జీ, అంటువ్యాధుల ఇన్స్టిట్యూట్ (ఎన్ఐఏఐడీ), ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా పరిశీలించారు. టీకాలు ఇచ్చిన అనంతరం 28 రోజుల తర్వాత అవి కరోనా బారిన పడేలా చేశారు. వైరస్ కారణంగా తలెత్తే న్యుమోనియాను టీకా నిలువరించగలిగినట్టు గుర్తించారు.
హౌం క్వారంటైన్లో నాగాలాండ్ సీఎం
నాగాలాండ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో సీఎం నీఫియు రియో హౌం క్వారంటైన్లోకి వెళ్లారు. ముందుజాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రితోపాటు సీఎం కార్యాలయ అధికారులు హౌం క్వారంటైన్ లోకి వెళ్లామని నాగాలాండ్ సీఎంవో ట్వీట్ చేసింది. కార్యాలయన్ని శానిటైజ్ చేసి 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది: చిదంబరం
కరనా వైరస్ను కట్టడిచేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం ఆరోపించారు. ఈ క్రమంలోనే మోడీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత రేటు వద్ద కరోనా కేసులు పెరుగుతూ ఉంటే సెప్టెంబరు చివరి నాటికి దేశంలో 55 లక్షల కరోనా కేసులు నమోదుకావచ్చునని అన్నారు.
కరోనాతో 102 మంది 'మహా' పోలీసులు బలి
మహారాష్ట్రలో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహా పోలీసుల్లో కరోనా కల్లోలం రేపుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 102 మంది పోలీసులను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఇందులో 8 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. తాజాగా 121 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 9,217కు చేరింది. కాగా, రాష్ట్రవ్యాప్తగా ఇప్పటివరకూ 4.20 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 15 వేల మరణాలు చోటుచేసుకున్నాయి.