Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-విద్యారంగానికి నిధులు పెంచకుండా లక్ష్యాలు ఎలా సాధ్యం : కాంగ్రెస్
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానం అంతా అయోమయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విమర్శించారు. గత ఆరేండ్లలో విద్యా శాఖకు మోడీ సర్కారు ఒక్కరూపాయి నిధులు కూడా పెంచడం లేదన్నారు. నిధులు పెంచకుండా ఎన్ని లక్ష్యాలు పెట్టుకుంటే ఏమి లాభమని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నూతన విద్యావిధానం స్పష్టత, ముందస్తు ప్రణాళిక లేకుండా ఉందని అభిప్రా యపడ్డారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయి ంచకుండా విద్యా విధానంలో మార్పులు ఏ విధంగా సాధ్యమన్నారు. దేశంలో సాంకేతిక పరిజ్ఞానం మెరుగవ్వాలంటే... కేంద్రబడ్జెట్లో నిధుల కేటాయింపు అధికంగా ఉండాలన్నారు. భావ వ్యక్తీ కరణ చేస్తున్న అనేకమంది విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ సంస్థలు విశ్వవిద్యాలయాల్లో దాడులకు పాల్పడు తున్నాయన్నారు. లక్షలాది అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగడానికి నీరు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, ధనిక వర్గాల విద్యార్థుల చదువుల్లో అంతరం పెరుగుతుం దన్నారు. కేంద్రం ధోరణితో విద్యార్థులు నూతన ఆవిష్కరణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.హెచ్ఆర్డీ మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ... ఆరేండ్ల తర్వాత కూడా ఎటువంటి సంప్రదింపులూ లేకుండా అకస్మాత్తుగా నూతన విద్యావిధానం కేంద్రం తీసుకురావడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అన్నారు.
హిందీ, సంస్కృతాన్ని రుద్దే కుట్ర : స్టాలిన్
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై వ్యతిరేకత తీవ్రమవుతున్నది. పలు రాష్ట్రాలకు చెందిన అధికార, ప్రతిపక్ష సభ్యులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఈపీతో ఒనగూరేదేమీ లేదనీ.. దేశమంతటా హిందీ, సంస్కృతాన్ని రుద్దే కుట్రలో భాగంగానే దీన్ని తీసుకొస్తున్నారని ద్రవిడ మున్నెడ్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ ఆరోపించారు. మనుస్మృతికి మెరుగులు దిద్ది దీన్ని రూపొం దించారని విమర్శించారు. ఈ అంశంలో తమతో కలిసివచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుని ఎన్ఈపీలో మార్పుల కోసం కేంద్రంపై పోరాడ తామని అన్నారు. తాజా విద్యా విధానాన్ని చిన్నారులపై మానసిక దాడిగా ఆయన అభివర్ణించారు. విద్యపై కేంద్రం పెత్తనాన్ని, రాష్ట్రా లను నియంత్రించడాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. ఎన్ఈపీ సమాఖ్య స్పూర్తికి విరుద్దమని స్టాలిన్ ఆరోపించారు.