Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఎగుమతులు లేకున్నా దేశీయంగా లాభపడొచ్చు : క్రిసిల్
న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గినా.. దేశీయంగా డిమాండ్ ఉండటంతో క్రిమిసంహారక మందులను తయారుచేసే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ) ఈ ఏడాది స్వల్ప వృద్ధి నమోదుచేస్తాయని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఇటీవలే క్రిసిల్ ఎస్ఎంఈ ట్రాకర్ను విడుదల చేసింది. దేశీయంగా కేంద్రీకృతమైన ఈ పరిశ్రమలో 6 శాతం వృద్ధి అంచనా వేయగా.. మొత్తంగా చూస్తే 1-2 శాతం వృద్ధిరేటు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
కోవిడ్-19 సంక్షోభం కారణంగా దేశాల మధ్య ఎగుమతులు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే భారత్ నుంచి క్రిమి సంహరక మందులను దిగుమతి చేసుకునే యూఎస్, బ్రెజిల్, ఫ్రాన్స్లలో వీటికి తగినంత డిమాండ్ లేకపోవడంతో.. ప్రస్తుతం 55 శాతంగా ఉన్న ఎగుమతులు 3 శాతం దాకా తగ్గుతాయని వ్యాపార వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే దేశీయంగా రైతులకు అనుకూల వాతావరణం కారణంగా సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. ఇది ఈ రంగంలో ఉన్న ఎస్ఎంఈలకు లాభించనుంది. పలు రాష్ట్రాల్లో కూలీల కొరతతో క్రిమిసంహారక, శిలీంద్ర సంహారిణి మందుల వినియోగం 2-3 శాతం పెరగనుందని భావిస్తున్నారు. ఇక ఈ రంగంలో దాదాపు 20 శాతం వాటా ఉన్న పెద్ద కంపెనీలకు ముడి చమురు ధరలు తగ్గడం ప్రయోజనకరంగా మారింది. కాగా, ఎగుమతుల వాటా అధికంగా ఉండే ఢిల్లీ, హైదరాబాద్తో పోలిస్తే.. దేశీయంగా ఉత్పత్తయ్యే అహ్మదాబాద్ వంటి ఎస్ఎంఈ క్లస్టర్లు ఎక్కువగా లాభపడతాయని క్రిసిల్ నివేదికలో వెల్లడించింది.
2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 30 వేల కోట్లుగా ఉన్న క్రిమిసంహారక మందుల పరిశ్రమ.. ఈ ఏడాది నాటికి రూ. 47 వేల కోట్లకు (9.5 శాతం వృద్ధి) చేరింది. ఇది వచ్చే ఏడాది రూ. 48 వేల కోట్లకు (1-2 శాతం వృద్ధి) చేరనుందని ఈ రంగంలోని నిపుణులు అంచనావేస్తున్నారు.