Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-అమెరికా... బ్రెజిల్ను దాటిన భారత్
-వరుసగా రెండో రోజూ రికార్డు స్థాయిలో కేసులు
న్యూఢిల్లీ : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పుడు భారత్లో పంజా విసురుతున్నది. రోజువారీ కేసుల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశం ప్రస్తుతం భారత్ కావటం మరింత భయాందోళనకు గురిచేస్తున్న అంశం. అత్యధిక కేసులతో హడలెత్తించిన అమెరికా, బ్రెజిల్ను భారత్ దాటేస్తున్నది. రోజువారీ కేసుల్లో వరుసగా రెండో రోజూ అగ్ర దేశాలను దాటి మొదటి స్థానంలోకి వెళ్లింది. పాజిటివ్ కేసుల సంఖ్యలో ఇండియా మూడవ స్థానంలో ఉన్నప్పటికీ రోజువారీ కేసుల సంఖ్యలో మాత్రం మన దేశం అగ్రస్థానానికి చేరుకుంటున్నది. సోమవారంనాడు విడుదలైన వివరాల ప్రకారం అమెరికా, బ్రెజిల్ కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఇండియాలో కేసులు నమోదు అయ్యాయి. కాగా, మంగళవారం కూడా ఇదే పరంపర కొనసాగింది. మన దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంటే.. అమెరికా, బ్రెజిల్లో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో కేసుల తగ్గుముఖం చాలా స్వల్ప స్థాయిలో ఉన్నప్పటికీ, బ్రెజిల్లో చాలా పెద్ద సంఖ్యలో తగ్గాయి. ఇటు ఇండియాలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. రోజూ 50 వేల కేసులకు పైగానే నమోదు అవుతున్నాయి. సోమవారం భారత్లో 52,050 మంది కరోనా బారినపడ్డారు. ఇక అమెరికాలో 48,622 బ్రెజిల్లో 17,988 మందికి వైరస్ సోకింది. ఆదివారం భారత్లో 53,000 కేసులు నమోదయ్యాయి. అదే రోజు అమెరికాలో 49,000, బ్రెజిల్లో 24,000 వేల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో నిత్యం దాదాపు 60వేల కేసులు బయటపడుతున్నాయి. కానీ గత రెండురోజులుగా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. భారత్లో నిత్యం నమోదౌతున్న కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. భారత్లో రెట్టింపు కేసులు నమోదుకావడానికి 21రోజుల సమయం పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోవిడ్-19 పంజా
-ఒక్క రోజే 803 మంది మృతి
- వరుసగా ఆరో రోజు 50 వేలకుపైగా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,55,745కి చేరింది. అలాగే మరణాల సంఖ్య భారీగా పెరిగింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 803 మంది ప్రాణాలను మహమ్మారి కబళించింది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 38,939కి చేరింది. వైరస్ బారి నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి 12,30,509 మంది డిశ్చార్జి అయ్యారు. అంటే ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 5,86,298. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 66.30గా ఉంది. దేశంలో గడచిన 24 గంటలలో 6,61,892 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేసినట్టు కేంద్రం తెలిపింది. అంటే పాజిటివ్ రేట్ 7.86శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.