Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో మరింత నగంగా బయటపడ్డ వైనం
- సమాజానికి వెలుగు చూపిన ఏంగెల్స్
- ఆన్లైన్ సదస్సులో ప్రకాశ్ కరత్
న్యూఢిల్లీ : పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో పడిందని సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పెట్టుబడిదారీ వ్యవస్థ అసలు స్వరూపాన్ని మరింత నగంగా బయటపెట్టిందన్నారు. కారల్ మార్క్స్ సహచరుడు, మార్క్సిస్టు మహోపాధ్యాయుడు ఫ్రెడరిక్ ఏంగెల్స్ 125 వర్థంతి, ఆయన పుట్టి ఈ ఏడాదికి 200 ఏళ్లు కావస్తున్న సందర్భంగా బుధవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షతన ''మార్క్సిజానికి ఏంగెల్స్ జీవితకాల కృషి-మార్క్స్తో మైత్రి'' అంశంపై ఆన్లైన్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ.. కార్ల్మార్క్సు సహచరుడు, మార్క్సిస్టు మహానేత ఫ్రె˜డరిక్ ఏంగెల్స్ వారసత్వం గురించి చర్చించుకుంటున్నామన్నారు. శాస్త్రీయ సామ్యవాదంపై పరిశోధన చేశారన్నారు. కారల్మార్క్స్ తరువాత ఆ పాత్ర ఏంగెల్స్ పోషించారని, ఆయన పేర్కొన్నారు. మార్క్స్కు ఆయన సహాయకుడుగా ఉన్నారనడం సరి కాదని, ఏంగెల్స్ వ్యక్తిగతంగా మంచి రచయిత అని అన్నారు. 'సిద్ధాంతం- కార్మికవర్గ ఆచరణ'లో ఆయన కృషి ఉందన్నారు. 'శాస్త్రీయ సోషలిజాన్ని' అభివృద్ధిపరచడంలోను, కార్మిక వర్గ ఉద్యమానికి దానిని అన్వయించడంలోను అన్నారు. మార్క్స్ కంటే ముందే ఏంగెల్స్ సెంట్రాలిటీ ఆఫ్ వర్కింగ్ క్లాస్ గురించి వివరించారని పేర్కొన్నారు. ఆయన చదువు అనంతరం 1844లో ఇంగ్లాండ్లో ఉన్న వర్కింగ్ క్లాస్ పరిస్థితులపై పని చేశారని, వాటి గురించి వివరించారని తెలిపారు. 1848లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టో రాశారని చెప్పారు. ప్రైవేట్ పాపర్టీ ఫ్యామిలీ ఆఫ్ ది స్టేట్, యాంటీ డ్యూరింగ్, డైలాస్టిక్స్ ఆఫ్ ది నేచర్ వంటి అనేక గ్రంథాలు రాశారని వివరించారు. ఏంగెల్స్కు సైన్స్పైన మక్కువ ఎక్కువని, యూరపులో అందుబాటులో వివిధ సైన్స్ అంశాలపైన అధ్యయనం చేశారని తెలిపారు. సైంటిఫిక్ యూరోపియన్కి సైంటిఫిక్ సోషలిజం ఒక కరపత్రంగా ఉందని అన్నారు. ఏంగెల్స్ ఎప్పుడూ శాస్త్రీయ దృష్టితోనే ముందుకు సాగారని తెలిపారు. ఇప్పుడు మార్క్సిజం గురించి మాట్లాడుకుంటున్నామంటే మార్క్స్, ఏంగెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకోవడంగానే చూడాలని కరత్ పేర్కొన్నారు. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టేందుకు కార్మికవర్గ ఉద్యమం ప్రతిన పూనాలని, అదే ఏంగెల్స్కు ఇచ్చిన ఘనమైన నివాళి అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం చాలా తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోందన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాపితంగా విస్తరిస్తున్నదని,భారత్పైనా అది తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. దేశంలో 19 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని, దాదాపు 40 వేల మంది కరోనా మహమ్మారికి బలయ్యారని కరత్ వివరించారు. ఈ మహమ్మారితో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత లోపభూయిష్టమైనదో మరోసారి తేటతెల్లమైందని, కరోనా వంటి మహమ్మారులు వచ్చిన ప్రతిసారి ఆయా ప్రాంతాల్లో చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక రుగ్మతలన్నీ నగంగా బయటపడతాయని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో నయా ఉదారవాద విధానాలు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయని, ఇది వ్యవస్థాగత సంక్షోభంగా పార్టీ మహాసభ పేర్కొందన్నారు. 2008 తరువాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం నెలకొందని, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశం అమెరికా ఆర్థికవ్యవస్థ కరోనా దెబ్బకు అతలాకుతలమవుతోందన్నారు. గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీ వల్ల అన్ని పెట్టుబడిదారీ దేశాలు ఆర్థికంగా తీవ్ర సంకట స్థితిలో పడ్డాయన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే మాంద్యాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం, ఆదాయాలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గిపోవడం వంటి చర్యలతో కోట్లాది ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారన్నారు. నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా బడా పెట్టుబడిదారులకు, కంపెనీలకు బెయిలవుట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు సాధారణ ప్రజలకు, కార్మికులను పూర్తిగా గాలికొదిలేశాయని ఆయన విమర్శించారు. కరోనా తరువాత కూడా ఉపాధి, ఆదాయాలు, పెన్షన్, సామాజిక భద్రత ప్రయోజనాలు వంటి వాటిపై ప్రభుత్వాలు ఎడాపెడా కోతలు విధించే ప్రమాదముందన్నారు. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత కూడా ఇలానే చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తొలుత మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, షడ్రక్ల అకాల మరణానికి ప్రకాశ్ కరత్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఏంగెల్స్పై ప్రజా నాట్యమండలి ఎపి రాష్ట్ర కమిటి రూపొందించిన గీతాన్ని పి.మధు ఆవిష్కరించారు.