Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న విలయతాండవంతో కోట్లాది మందికి ఉపాధినిస్తున్న సేవారంగం కుదేలవుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికని మార్చిలో విధించిన లాక్డౌన్ కాలంలో వ్యాపారాలన్నీ పూర్తిస్థాయిలో మూతపడగా.. అన్లాక్ మొదలై రెండునెలలు కావస్తున్నా పరిస్థితులు మారడం లేదు. జూన్ దాకా నగరాలు, ద్వితీయస్థాయి పట్టణాలకే పరిమితమైన కరోనా వైరస్ విజృంభణ.. కొద్దిరోజులుగా గ్రామాల్లోనూ పంజా విసురుతుండటంతో గడప దాటి బయటకువెళ్లాలంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జిల్లాలు, టౌన్లు, మండలాలు స్వచ్ఛందంగా లాక్డౌన్లు పాటిస్తున్నాయి. మరోవైపు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు లేక పర్యాటకరంగం విలవిల్లాడుతుండగా, అన్లాక్ 3.0 లోనూ దేశవ్యాప్తంగా హౌటళ్లు, రెస్టారెంట్లు అంతంతమాత్రంగానే తెరుచుకున్నాయి. దీని ప్రభావం సేవారంగం మీద తీవ్రంగా పడుతున్నది. ఐహెచ్ఎస్ పర్చేజింగ్ మేనేజ్మెంట్ ఇండెక్స్ (పీఎంఐ) నివేదిక ప్రకారం.. వరుసగా నాలుగో నెలలోనూ సేవారంగం ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదుచేయలేదు. పీఎంఐ సేవలు జూన్లో 33.7 శాతంగా ఉండగా, జులైలో స్వల్పంగా పెరిగి 34.2 శాతం వద్ద ఉన్నాయి. స్థానికంగా నగరాల్లో లాక్డౌన్లు, ఆంక్షల కారణంగా సేవారంగం ఇంకా వేగం పుంజుకోవడం లేదని పారిశ్రామిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీలో 55 శాతం వాటా సేవారంగానిదే. దేశంలోని శ్రామికశక్తిలో 33 శాతం మంది ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. కాగా కొద్దికాలంనుంచి ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నది. కోవిడ్ దెబ్బకు పర్యాటకరంగం విలవిల్లాడుతూనే ఉన్నది. విమానసేవలు పునరుద్దరించినప్పటికీ.. కరోనా నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ విహారయాత్రలకు వెళ్లడానికి ప్రజలు సుముఖంగా లేరు. జూన్లో దేశీయ విమానాల సర్వీసులు ప్రారంభం కాగా.. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి 1.05 లక్షల మంది ప్రయాణించారని గణాంకాలు చెబుతున్నాయి. ఇది గతేడాది జూన్తో పోలిస్తే 86 శాతం తక్కువ. దేశవ్యాప్తంగా చూస్తే.. అన్ని విమానాశ్రయాల్లో కలిపి జూన్లో 38.55 లక్షల మంది ప్రయాణించారు. ఇది 2019 జూన్తో పోలిస్తే 83.5 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. కరోనా దెబ్బకు ఆతిథ్య రంగం ఆగమవుతున్నది. రెస్టారెంట్లు అంతంతమాత్రంగానే తెరుచుకుంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ హౌటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఎఐ) వివరాల ప్రకారం.. దేశంలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తేసిన తర్వాత కూడా 20 శాతం మాత్రమే హౌటళ్లు తెరుచుకున్నాయి. ఎఫ్హెచ్ఆర్ఎఐలో దేశవ్యాప్తంగా పదివేలకు పైగా హౌటళ్లు సభ్యులుగా ఉన్నాయి. వీటిలో 20 నుంచి 30 శాతం హౌటళ్లు, రెస్టారెంట్లు స్థానిక పరిస్థితుల ఆధారంగా తెరవడం, మూసేయడం చేస్తున్నాయని దాని ప్రతినిధులు వెల్లడించారు. ఇదేవిషయమై దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలు కలిగిన రత్నసాగర్ రెస్టారెంట్ల మేనేజింగ్ డైరెక్టర్ రోషన్ బనన్ స్పందిస్తూ.. తమ రెస్టారెంట్లలో సుమారు 7 వేలమంది సిబ్బంది పనిచేస్తున్నారనీ, లాక్డౌన్ కారణంగా అందులో దాదాపు 40 శాతం మంది వారి స్వస్థలాలకు వెళ్లారని అన్నారు. ఇప్పట్లో వారు తిరిగొచ్చేసూచనలు కనిపించడం లేదనీ, దీంతో ఉన్నవారితోనే హౌటళ్లు నడిపిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ కంటే ముందు తమకు వచ్చిన దాంట్లో కనీసం పది శాతం సైతం ఇప్పుడు రావడం లేదని ఆయన వాపోయారు. రెస్టారెంట్ల అద్దెలు, వాటి నిర్వహణ భారం నానాటికీ ఎక్కువవుతుండటంతో.. కొద్దిచోట్ల మాత్రమే వాటిని తెరుస్తున్నామని రోషన్ వివరించారు.
ఆగని తొలగింపులు
వ్యాపారాలు లేకపోవడంతో సేవారంగంలోని సంస్థల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఏప్రిల్, మే లలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోగా.. ఇప్పటికీ అది ఆగడం లేదు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు మూతపడటంతో దాదాపు 70 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడిం దని గణాంకాలు చెబుతున్నాయి. హౌటళ్లు, రెస్టారెంట్లే గాక ఆన్లైన్ వేదికగా ప్రజలకు ఇంటివద్దకే ఆహారాన్ని సరఫరా చేసే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు కూడా మే నెలలో సుమారు 2 వేల మంది దాకా సిబ్బందిని తొలగించాయి. కరోనా సాకు చూపి ఐటీ సంస్థలు కూడా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియ ను నిరాటంకంగా కొనసాగిస్తూనే ఉన్నాయి. విమానయానరంగంలోనూ సిబ్బం దిని వదిలించుకునే కార్యక్రమానికి ఆయా సంస్థలు శ్రీకారం చుడుతున్నాయి. తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని ఇంటికి పంపేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయగా.. మరిన్ని సం స్థలు అదే బాటలో పయనిస్తున్నాయని ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.