Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రన్వేపై జారి ముక్కలైన విమానం
- పైలట్తో సహా 16 మంది మృతి
తిరువనంతపురం :కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు చెందిన ఐఎక్స్ 1344 విమానం కోజికోడ్ సమీపంలోని కరీపుర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి రెండు ముక్కలైంది. శుక్రవారం సాయంత్రం 7.40 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 16 మంది మృతి చెందారు. పది మంది చిన్నారులు సహా 100 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎన్డ్ ఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తున్నది. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మౄతులకు సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వందే భారత్ మిషన్లో భాగంగా 189 మంది ప్రయాణీకులతో దుబారు నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరిన ఈ విమానం శుక్రవారం రాత్రి 7.40 నిమిషాలకు ల్యాండ్ అవ్వాల్సివుండేది. చివరి నిమిషంలో ప్రమాదంలో చిక్కుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఫైలట్లలో ఒకరిని కమాండర్ కెప్టెన్ దీపక్ సాతేగా గుర్తించారు. క్షతగాత్రులను కోజికోడ్లోని ఆస్పత్రులకు తరలించారు. సహాయక చర్యల నిమిత్తం 32 అంబులెన్స్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మలప్పురం, కోజికోడ్ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని విమానం మంటల్లో చిక్కుకోకుండా సహాయక చర్యలు చేపట్టారు.ఎయిర్పోర్టులో భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నది.భారీ వర్షమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు ప్రకటించిన పౌర విమానయాన శాఖ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపింది.
ప్రధాని ఫోన్ : ఈ ఘటనపై విజయన్తో ప్రధాని మోడీ ఫోన్లో సంభాషిం చారు.అత్యవసర చర్యలు తీసుకోవాలని పోలీసులకు, అగ్నిమాపక దళానికి ఆదేశాలు ఇచ్చారు.
ఏచూరి దిగ్భ్రాంతి : కోజికోడ్ విమాన ప్రమాద ఘటన పట్ల సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి దిగ్భ్రాంతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ కూడా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.