Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధాని, విద్యాశాఖ మంత్రికి స్టాలిన్ లేఖ
న్యూఢిల్లీ : నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) అమలును నిలిపివేయాలని ప్రధాని మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్కు డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ లేఖ రాశారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను అనుసరించడానికి పరిస్థితి అనుకూలించే వరకూ దీన్ని ఆపాలని కోరారు. 'ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దేశం తల్లకిందులై, ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న తరుణంలో పార్లమెంట్లో చర్చ లేకుండా ఎన్ఇపి 2020ను ఆమోదించేందుకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం, ప్రజాస్వామ్య వ్యవస్థాపక సూత్రాలను బలహీన పరుస్తుంది' అని లేఖలో పేర్కొన్నారు. ఇది కేంద్రం తీసుకున్న ఏకపక్ష చర్య అని, దేశం ఆధారపడి ఉన్న సమాఖ్య విధానాలపై తీవ్ర ప్రభావాన్ని కల్గిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. '2019లో ఎన్ఇపి ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం ముందుంచినప్పుడు.. వివిధ నిబంధనలను డిఎంకె తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రానికి కొన్ని సూచనలు అందించాం. ప్రస్తుతం ఎన్ఇపిని చూస్తే అప్పటి ముసాయిదాకు ఏ మాత్రం భిన్నంగా లేదు. ఎటువంటి సిఫార్సులనూ చేర్చలేదు' అని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత విధానం రాష్ట్రాల అధికారాలను అణగదొక్కడమే కాకుండా దేశంలో విద్యాసాధన, అందుబాటు, నాణ్యతలో సాధించిన పురోగతికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వానికి అదనపు అడ్డంకులను ఏర్పరిచారన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు విద్యను పొందేందుకు అదనపు ప్రతిబంధకాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు. తప్పనిసరిగా తమిళం నేర్చుకోవాలనే నిబంధనతో ఇప్పటికే ద్విభాషా విధానం రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో అన్ని పాఠశాలల విద్యా స్థాయిల్లో సంస్కృతాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని అంగీకరించేది లేదని తెలిపారు. ఈ చర్య తమిళ భాష కీర్తిని, గౌరవాన్ని బలహీనపరుస్తోందని, తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతిస్తుందని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు భారం తగ్గించేందుకు జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెబుతోందని, 3, 5, 8 తరగతులకు సంబంధించి ఈ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని తెలిపారు. కళాశాల ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనడం అట్టడుగున ఉన్న విద్యార్థుల పట్ల వివక్ష చూపడమే అవుతుందని పేర్కొన్నారు. ఎన్ఇపిలో ఎస్సి, ఎస్టి, ఒబిసి వంటి సామాజికంగా వెనుకబడిన రిజర్వేషన్ల గురించి ప్రస్తావించలేదని, మహిళల నిష్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టలేదని వివరించారు. రాష్ట్ర హక్కులను అణగదొక్కే, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే పలు అంశాలను ఆయన ప్రస్తావించారు.