Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం
అమరావతి: కౌలు రైతులకు గుర్తింపు కార్డుల ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలివ్వాలని, దీనికి బ్యాంకింగు విధానంలో మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.రంగారావు, పి.జమలయ్య బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ పంటల సాగుదారు హక్కుల చట్టం (2019) ప్రకారం సిసిఆర్సి కార్డులు పొందిన కౌలురైతులకు పంట రుణాలు విధిగా ఇవ్వాలని చట్టంలో నిబంధనలున్నాయన్నారు. ఈ చట్టాన్ని అమలు పర్చడంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం, కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి సిసిఆర్సి కార్డులు పొందినవారితో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటుచేసి అందిస్తామని చెప్పడం కౌలు రైతులను భ్రమపెట్టడమే అవుతుందని పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనరు హెచ్.అరుణ్కుమార్ మాట్లాడుతూ కౌలురైతులకు సెల్ఫ్హెల్ప్ గ్రూపులు ఏర్పాటుచేసి పంట రుణాలు ఇప్పించాలనే మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, ఇటువంటి ఆదేశాలతో కౌలురైతులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల హక్కుల చట్టం ద్వారా కౌలురైతులకు పంట రుణాలివ్వాలని ముఖ్యమంత్రి ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో ఆదేశాలిచ్చినా, బ్యాంకులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా, ఇంతవరకు ఒక్క కౌలురైతుకూ పంటరుణం ఇవ్వలేదని పేర్కొన్నారు.స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తామని, తద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పడం వట్టి భూటకమని పేర్కొన్నారు. ఒకవేళ కొంత మందికి ఇచ్చినా, సున్నావడ్డీ ఫథకం వర్తించడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, గుర్తింపు కార్డుల జారీ విషయంలో ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించి, భూ యజమాని ప్రమేయం లేకుండా సిసిఆర్సి కార్డులు ఇవ్వాలని కోరారు.
కార్డులు పొందిన కౌలురైతులకు చట్టం ప్రకారం, స్కేల్ ఆఫ్ ఫైనాన్సు ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, రుణాలు ఇవ్వని బ్యాంకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంట వేయకుండానే రుణాలు తీసుకున్న భూ యజమానులపై, రుణాలు ఇచ్చిన బ్యాంకు ఆధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, మొత్తంగా బ్యాంకు విధానంలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
కౌలురైతులకు గుర్తింపుకార్డులు, రైతుభరోసా, పంటరుణాలు, ఈ-క్రాఫ్ బుకింగ్, పంటల బీమా తదితర రాయితీలు అందించడానికి ఒక ప్రత్యేక నోడల్ అధికారులను పైస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.