Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిపొర్లుతున్న వాగులు
- విలీన మండలాల్లో రాకపోకలకు అంతరాయం
రాజమహేంద్రవరం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో గోదావరిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. భారీ వర్షాలకు ఇంద్రావతి, శబరి, సీలేరు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. డొంకరాయి జలాశయం నుంచి సీలేరు నదిలోకి రెండు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా పేరూరు, మేడిగెడ్డ రిజర్వాయర్ల నుంచి అత్యధికంగా నీటి ప్రవాహం వస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఎప్పటికప్పుడు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు పెరగడంతో అన్ని బ్యారేజీల నీటిమట్టాలూ పెరిగాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10.15 అడుగుల నీటిమట్టం నమోదు కాగా, సముద్రంలోకి 2.62 లక్షల క్యూసెక్కుల అదనపు నీటిని, పంట కాలువలకు పది వేల కూసెక్కుల నీటిని విడుదల చేశారు. చింతూరు మండలంలోని సోకులేరు వాగు పొంగడంతో వి.ఆర్.పురం, చింతూరు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్.పురం మండలంలోని అన్నవరం వాగు పొంగి ప్రవహించడంతో 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కూనవరం మండలంలోని కొండరాజుపేట వద్ద వాగులో నీటి ఉధతికి టేకులబోరు, జగ్గవరం, పంద్రాజుపల్లి, భీమవరం గ్రామాలకు అంతరాయం ఏర్పడింది.