Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 శాతం కరోనా కేసులు దేశంలోనే...
- ప్రపంచ మరణాల్లో నాలుగోస్థానం..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతూనే ఉన్నది. దేశంలో నిమిషానికి 42 మంది వైరస్ బారినపడుతుండటం వైరస్ వ్యాప్తికి అద్దం పడుతున్నది. గడచిన వారం రోజుల వ్యవధిలో ప్రపంచంలోని మొత్తం కరోనా కేసుల్లో 23 శాతం, మరణాల్లో 15 శాతం ఇండియాలోనే సంభవించడం ఆందోళన కలిగి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా (53 లక్షల కేసులు), బ్రెజిల్ (31 లక్షల కేసులు)లు ఉన్నాయి. మరణాల విషయంలో నాలుగోస్థానంలో ఉంది. ఇక రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల పరంగా చూస్తే.. భారత్ మొదటి స్థానంలో కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటు కరోనా పరీక్షల విషయంలో భారత్ వెనుకబడి ఉన్నదని వరల్డోమీటర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో 10 లక్షల మంది జనాభాకు 1,99,803 మందికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా, బ్రెజిల్లో ఈ సంఖ్య 62,200గా ఉంది. భారత్లో మాత్ర 10 లక్షల జనాభాకు కేవలం 18,300 పరీక్షలు మాత్రమే చేస్తున్నారు.కాగా, తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో గత 24 గంటల్లో 60,963 మందికి కరోనా సోకింది. ఇదే సమయంలో 834 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638కి చేరింది. వైరస్ మరణాల సంఖ్య 46,091కి పెరిగింది. ప్రస్తుతం 6,43,948 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 16,39,600 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 70.38 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.98 శాతంగా ఉంది. కాగా, దేశంలో 2,60,15,297 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే 7,33,449 శాంపిళ్లను పరీక్షించినట్టు తెలిపింది.
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్కు కరోనా
కరోనా బారినపడిన కేంద్రమంత్రుల జాబితాలో శ్రీపాద్ నాయక్ సైతం చేరారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇవాళ కరోనా టెస్టులు చేయించుకున్నాననీ, పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిపారు. అయితే ఎలాంటి లక్షణాలు లేవని వివరించారు. కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితిలోనే ఉందనీ, ప్రస్తుతం హౌం ఐసోలేషన్లో ఉన్నానని తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో, గత కొన్నిరోజులుగా తనను కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు.
రష్యా వ్యాక్సిన్ భద్రతా, ప్రభావాన్ని అంచనావేయాలి : ఎయిమ్స్
రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ విజయవంతమైతే దాని భద్రత, ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరముందని ఢిల్లీ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండకూడదనీ, ఇది మంచి రోగనిరోధక శక్తిని అందించాలన్నారు. వ్యాక్సిన్ను భారీగా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్కు ఉందని తెలిపారు.'స్పుత్నిక్ వీ' అని పిలువబడే ఈ టీకాకు సంబంధించి ఇంకా తుది పరీక్షలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
11,362 మంది మహా పోలీసులకు కరోనా
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తుండటం.. మహా పోలీసులను కలవరానికి గురిచేస్తున్నది. తాజాగా 264 మంది పోలీసులకు కరోనా పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. ఇదే సమయంలో ముగ్గురు పోలీసులు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 11,362కు చేరగా, చనిపోయిన వారి సంఖ్య 121కి పెరిగింది. కాగా, రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5.3 లక్షలు దాటగా 18,306 మందికిపైగా మరణించారు.
మధ్యప్రదేశ్లో 14 మంది మహిళా ఖైదీలకు కరోనా
మధ్యప్రదేశ్లో తాజాగా 14 మంది మహిళా ఖైదీలకు కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలోని బైధన్ జైలు నుంచి షాడోల్ జైలుకు తరలించిన కొన్ని రోజుల తరువాత 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో 40వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా, వేయికి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి.
మేఘాలయలో 18 మంది బీఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్
మేఘాలయలో 18 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది సహా 23 మందికి కరోనా పాజటివ్గా పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,165కు చేరింది. తాజా కేసుల్లో ఈస్ట్ ఖాసీ హిల్స్ నుంచి 11 మంది, వెస్ట్గారో నుంచి 10 మంది, నార్త్, సౌత్గారో హిల్స్ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున మహమ్మారి బారినపడ్డట్టుహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అమన్ వార్ పేర్కొన్నారు.